ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ కీలక కేసు విషయంలో సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. వ్యక్తి చనిపోయిన తర్వాత.. కేసును కొనసాగించాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించింది. దీనిలో ఎలాంటి తప్పూ లేదని పేర్కొంది. “వ్యక్తి చనిపోయిన తర్వాత.. ఆయన వచ్చి వాంగ్మూలం ఇవ్వలేడు కదా? అలాంప్పుడు ఆ కేసులో నిజానిజాలు ఏంటనేది ఎవరు చెబుతారు? ఇక, ఈ కేసును మూసివేయడమే మంచిది.“ అని అభిప్రాయపడింది. అయితే.. తీర్పును మాత్రం వెల్లడించలేదు.
ఎవరు? ఏంటాకేసు?
ఈనాడు గ్రూపు సంస్థల అధిపతి, దివంగత రామోజీరావుకు సంబంధించిన మార్గదర్శి ఫైనాన్షియర్స్, చిట్స్ విషయంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ కేసు వేసిన విషయం తెలిసిందే. చిట్స్ పేరుతో ఆయన ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించారని.. ఇది ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధమని.. దీనిని ఎలా పరిగణిస్తారు? అనేది ఈ కేసు సారాంశం. దీనిపై ఇప్పటికే సుప్రీంకోర్టు పలు మార్లు విచారణ జరిపింది. అదేసమయంలో తెలంగాణ హైకోర్టులోనూ ఈ కేసు వాదనలు జరిగాయి. చివరిగా తెలంగాణ హైకోర్టు.. రామోజీరావు మృతి చెందిన నేపథ్యంలో కేసును మూసి వేస్తున్నట్టు ప్రకటించింది.
దీనిని ఉండవల్లి అరుణ్కుమార్.. సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. “వ్యక్తి చనిపోయినంత మాత్రాన .. వ్యవస్థ(మార్గదర్శి) చనిపోలేదని.. దీనిని కొనసాగిస్తున్నారు.. కాబట్టి.. తదుపరి నిర్వాహకులను దీనిలో ఇంప్లీడ్ చేసి విచారణ సాగించాలి.“ అని ఉండవల్లి తన వాదనలను లిఖిత పూర్వకంగా కోర్టుకు వినిపించారు. అనధికార డిపాజిట్లను సేకరించవచ్చా? అనే విషయంపై స్పష్టత ఇవ్వాలని కోరారు. అనధికారికంగా ప్రజల నుంచి డిపాజిట్లు స్వీకరించి.. అనేక సంస్థలు బోర్డు తిప్పేశాయని ఆయన తెలిపారు. అయితే.. రామోజీరావు.. సంస్థలు ఆర్థిక నష్టాలు రాకపోవడంతో ఎలాంటి ఇబ్బంది రాలేదని వివరించారు.
అయినప్పటికీ.. ఒక వ్యక్తి.. హిందూ అవిభాజ్య కుటుంబం(హెచ్యూడీఎఫ్) కింద ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించేందుకు అవకాశం ఉందా? అని ఉండవల్లి ప్రశ్నించారు. అయితే.. దీనిపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో అసలు నిందితుడు(రామోజీ) లేరు కాబట్టి.. ఇప్పుడు ఆ ప్రశ్న ఉత్పన్నంకాదని.. వ్యక్తి మరణించిన తర్వాత అనేక కేసులను మూసి వేస్తున్నామని వ్యాఖ్యానించింది. ఇప్పటికే అనేక తీర్పులు కూడా ఉన్నాయని తెలిపింది. ఆ తీర్పులనే దీనికి కూడా సంక్రమించేలా చేయొచ్చని వ్యాఖ్యానించింది. అయతే.. కోర్టు సమయం ముగియడంతో వాదనలను వాయిదా వేసింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates
