మోడీపై కేసీఆర్ అల‌క‌.. త‌ల‌సానితో స్వాగ‌తం

ప్రధానమంత్రి న‌రేంద్ర‌ మోడీ ఈ నెల 5న‌ తెలంగాణ ప‌ర్య‌ట‌న‌కు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. రెండు కీల‌క కార్య‌క్ర‌మాల్లో పాల్గొనేందుకు ఆయ‌న వ‌స్తున్నారు. శంషాబాద్‌ ముచ్చింతల్ లో జ‌రుగుతున్న శ్రీ రామానుజ సహస్రాబ్ధి ఉత్సవాలు, ఇక్రిశాట్ 50వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు ప్రధాని మోడీ వ‌స్తున్నారు. అయితే, ఈ టూర్లో ప్ర‌ధాన‌మంత్రికి స్వాగ‌తం ప‌ల‌క‌వ‌ద్ద‌ని సీఎం కేసీఆర్ నిర్ణ‌యించుకున్నారు.

ఇంతేకాకుండా, త‌న మంత్రివ‌ర్గ స‌హ‌చ‌రుడు త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్‌తో ఆహ్వానం ప‌లికించాల‌ని ఆయ‌న ఏర్పాట్లు చేయ‌డం గ‌మ‌నార్హం. శ‌నివారం మధ్యాహ్నం 2.45గం.లకు పఠాన్ చెరులోని ఇక్రిశాట్ 50వ వార్షికోత్సవ వేడుకలను ప్రధాని మోడీ ప్రారంభిస్తారు. మొక్కల సంరక్షణపై ఇక్రిశాట్ వాతావరణ మార్పు పరిశోధనా సదుపాయాన్ని, రాపిడ్ జనరేషన్ అడ్వాన్స్‌మెంట్ ఫెసిలిటీని ప్రధాని ప్రారంభిస్తారు.

ఈ రెండు సౌకర్యాలు ఆసియా, సబ్-సహారా ఆఫ్రికాలోని చిన్న రైతుల కోసం అంకితం చేయనున్నట్టు మోదీ ప్రకటించనున్నారు. ఈ సందర్భంగా ఇక్రిశాట్ ప్రత్యేకంగా రూపొందించిన లోగోను, స్మారక స్టాంపును అవిష్కరించనున్న ప్రధాన మంత్రి. అనంతరం సాయంత్రం 5గం.లకు రామానూజాచర్య సమత మూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించి జాతికి అంకితం చేయనున్నారు.

అయితే, ఈ కార్య‌క్ర‌మాల‌కు హాజ‌రైన స‌మ‌యంలో స్వాగ‌తం తెలుపుతున్న‌పుడు మ‌రియు తిరిగివెళుతున్న స‌మ‌యంలో ఆ కార్య‌క్ర‌మానికి హాజ‌రు కాకూడ‌ద‌ని సీఎం కేసీఆర్ నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ మేర‌కు అధికారికంగా కూడా స‌మాచారం ఇచ్చేశారు. పైగా మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్‌తో ఆహ్వానించ‌డం , వీడ్కోలు ప‌ల‌క‌డం చేయాల‌ని డిసైడ్ చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణ‌యం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇదిలాఉండ‌గా, ప్రధాని పర్యటన ఏర్పాట్లను పకడ్బందీగా చేయడంతోపాటు, ఈ పర్యటనను విజయవంతం చేసేందుకు అన్నీ శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని అధికారులకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు.