మోడీ భద్రతకు రోజు ఖర్చెంతో తెలుసా ?

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యక్తిగత భద్రతకు కేంద్ర ప్రభుత్వం ఎంత ఖర్చు చేస్తోందా తెలుసా ? 1.62 కోట్ల రూపాయలు. అవును మామూలుగా ఎవరు కూడా నమ్మలేరు. కానీ ప్రధానమంత్రి భద్రత విషయంపై  ఒక ఎంపీ అడిగిన ప్రశ్నకు హోంశాఖ సహాయ మంత్రి చెప్పిన సమాధానంతో ఈ లెక్క బయటపడింది. దేశంలో ఎంతమందికి ఎస్పీజీ, సీఆర్పీఎఫ్ భద్రత కల్పిస్తున్నారని డీఎంకే ఎంపీ దయానిధి మారన్ ఒక ప్రశ్న వేశారు.

దీనికి హోంశాఖ మంత్రి సమాధానమిస్తూ ఎస్పీజీ భద్రత దేశం మొత్తం మీద కేవలం ప్రధానమంత్రికి మాత్రమే ఉందన్నారు. గతంలో గాంధీ ఫ్యామిలిలో ముగ్గురికి ఎస్పీజీ భద్రత ఉండేదని అయితే ఈమధ్య కాలంలో వారికి ఎస్పీజీ భద్రతను ఉపసంహరించినట్లు చెప్పారు. దేశంలోని అత్యంత ప్రముఖులకు ఎస్పీజీ భద్రత తీసేసి దాని స్థానంలో సీఆర్పీఎప్ భద్రతను కల్పిస్తున్నట్లు చెప్పారు. అంటే హోంశాఖ మంత్రి చెప్పిన ప్రకారం ప్రధానమంత్రికి తప్ప ఇంకెవరికీ ఎస్పీజీ భద్రత లేదు.

మరైతే హోంశాఖ మంత్రి అమిత్ షా, రక్షణశాఖ మంత్రి రాజనాధ్ సింగ్ కు ఎలాంటి భద్రత ఉందనే విషయంలో స్పష్టత లేదు. ఎందుకంటే వాళ్ళ భద్రతలో ఎస్పీజీ భద్రత సిబ్బంది ఉన్నట్లే కనబడుతుంటుంది. కానీ హోంశాఖ మంత్రి స్వయంగా ఈ విషయం చెప్పారు కాబట్టి నమ్మాల్సిందే. ఒకపుడు ప్రధానితో పాటు గాంధీ ఫ్యామిలీలోని వారికి ఎస్పీజీ భద్రత కోసం 3 వేల మంది ప్రత్యేక కమేండోలుండేవారు. ఈ రక్షణ బృందానికి కేంద్ర ప్రభుత్వం ఏడాదికి రు. 594 కోట్లు ఖర్చుపెడుతోంది.

ఒకపుడు పై మొత్తాన్ని ఎస్పీజీ భద్రత ఉండే నలుగురికి సమానంగా ఖర్చుచేసేది. అయితే ఎస్పీజీ చట్టంలో మార్పులు తెచ్చి మిగిలిన ముగ్గురికి ఎస్పీజీ భద్రత అవసరం లేదని తేల్చటంతో మొత్తం 3 వేల మందిని+594 కోట్ల రూపాయల బడ్జెట్ ను ప్రధానమంత్రికే వాడేస్తున్నారు. సో మంత్రి చెప్పిన లెక్కల ప్రకారం చూస్తే గంటకు రు. 6.75 లక్షలు ప్రధానమంత్రి భద్రతకు ఖర్చవుతోంది. గంటకు రు. 6.75 లక్షలంటే రోజుకు 1.62 కోట్ల రూపాయలని లెక్క తేలింది. ఏదేమైనా రోజుకు ప్రధానమంత్రి భద్రత కోసం ఏకంగా 1.62 కోట్ల రూపాయలంటే మామూలు విషయం కాదు.