షర్మిల సంచలనం.. ఏపీలో పార్టీ

మొండితనంలో  తాత రాజారెడ్డి నోట్లో నుంచి పుట్టినట్లుగా.. పట్టుదల విషయంలో తండ్రి వైఎస్ కు ఏ మాత్రం తీసిపోని విధంగా వ్యవహరిస్తారని చెప్పే వైఎస్ షర్మిల మరోసారి వార్తల్లో వ్యక్తిగా మారారు. త్వరలో ఆమె ఏపీలో రాజకీయ పార్టీని ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా ఒక ప్రముఖ మీడియా సంస్థ అధినేత రాసిన కాలమ్ లో పేర్కొనటం..

దానిపై వైసీపీ నేతలు ఎవరూ స్పందించకపోవటం తెలిసిందే. ఇదిలాఉంటే.. సదరు మీడియా అధినేత తన తాజా ఆర్టికల్ లో కూడా.. ఏపీలో షర్మిల పార్టీ పెట్టే ఆలోచనలోఉన్నట్లుగా పేర్కొని సంచలనంగా మారారు. దీనిపై రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరగుతోంది. ఇదిలా ఉంటే.. ఈ రోజున హైదరాబాద్ లోని తన పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన షర్మిల.. సంచలన వ్యాఖ్య చేశారు.

మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చే క్రమంలో ఆమెకు అనుకోని రీతిలో ఒక ప్రశ్న ఎదురైంది. ఏపీలో పార్టీ పెడతారా? అని ఒక విలేకరి ప్రశ్నిస్తే.. అందుకు స్పందించిన షర్మిల.. ‘రాజకీయ పార్టీ ఎక్కడైనా పెట్టొచ్చు. పార్టీ పెట్టకూడదని రూల్ ఏం లేదు కదా?’’ అని ఎదురు ప్రశ్నించిన వైనం ఇప్పుడు షాకింగ్ గా మారింది. దీంతో.. ఏపీలో ఆమె పార్టీ పెట్టాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా జరుగుతున్న ప్రచారానికి బలం చేకూరినట్లుగా చెబుతున్నారు.

తాజాగా ఆమె పార్టీలోకి టీఆర్ఎస్ సీనియర్ నేత.. బీసీ నేతగా సుపరిచితులైన గట్టు రాంచందర్ రావు షర్మిల పార్టీలో చేరారు. ఆయనకు పార్టీ కండువా కప్పిన ఆమె.. పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా భేటీలో ఆమె నోటి నుంచి వచ్చిన వ్యాఖ్య ఇప్పుడు పెను సంచలనంగా మారింది. చూస్తుంటే.. ఏపీ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఎక్కువగా ఉందన్నఅభిప్రాయం వ్యక్తమవుతోంది.