పవన్ ఏడుస్తూ కూర్చుంటాడనుకున్నా-ఉండవల్లి

గతంతో పోలిస్తే రాజకీయాల్లో చాలా ఇన్ యాక్టివ్ అయినప్పటికీ కాంగ్రెస్ సీనియర్ నేత, రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్‌.. రాజకీయాలపై చేసే విశ్లేషణలు, వ్యక్త పరిచే అభిప్రాయాలకు ఇప్పటికీ విలువ ఉంది. వివిధ అంశాలపై ఆయన కొట్టినట్లుగా చెప్పే మాటలు.. అభిప్రాయాలను చాలామంది ఫాలో అవుతారు. తాజా ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఉండవల్లి ఇచ్చిన ఇంటర్వ్యూ నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది.

ఇందులో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై ఆయన ప్రశంసలు కురిపించారు. 2019 ఎన్నికల్లో పరాజయం తర్వాత పవన్ వెనుకంజ వేయకుండా రాజకీయాల్లో పోరాడుతున్న తీరును ఆయన కొనియాడారు. ఆయన రాజకీయాల నుంచి బ్రేక్ తీసుకుని సినిమాల్లో నటిస్తుండటాన్ని ఆయన సమర్థించారు. రాజకీయాల్లో కొనసాగాలంటే డబ్బు అవసరమని, పవన్ ఆ విషయాన్ని సూటిగా చెప్పి కష్టపడి సినిమాల్లో డబ్బులు సంపాదిస్తుంటే అభ్యంతరమేంటని ఆయన ప్రశ్నించారు.

“2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్‌కు రెండు చోట్లా అవమానకర ఓటమి ఎదురయ్యాక, తన పార్టీకి అంత తక్కువ ఓట్ల శాతం వచ్చాక పవన్ కళ్యాణ్ ఏడుస్తూ కొన్నాళ్లు ఇంట్లో కూర్చుంటాడని అనుకున్నా. ఎవరైనా అదే చేస్తారు. కానీ పవన్ మాత్రం అలా కాకుండా జనాల్లోకి వచ్చాడు. తాను ఓడిపోయినా జనాల్ని విడిచిపెట్టి వెళ్లను, మీ కోసం పోరాడతా అన్నాడు. ఇది చాలా మంచి నిర్ణయం. అలాంటి స్పోర్టింగ్ స్పిరిట్ ఉండాలి. ఓవైపు రాజకీయాల్లో కష్టపడుతూనే వీలు చూసుకుని సినిమాల్లో నటిస్తున్నాడు. దానిపై డొంకతిరుగుడు లేకుండా కొంచెం డబ్బులు సంపాదించుకోవాలి కాబట్టి సినిమాల్లో నటిస్తా అని అందరికి చెప్పే వెళ్లాడు. అలా ఓపెన్‌గా చెప్పి వెళ్లడం మంచి విషయం” అని ఉండవల్లి వ్యాఖ్యానించారు.

పవన్‌పై గతంలోనూ ఉండవల్లి ప్రశంసలు కురిపించారు. పవన్ లాంటి నిజాయితీ పరుడైన, తపన ఉన్న వ్యక్తి ఓడిపోవడం జనాల దురదృష్టమని ఆయనన్నారు.