ఏపీలో కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనపై సీఎం చంద్రబాబు ప్రోగ్రెస్ రిపోర్టు ఇచ్చారు. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితిని ఆయన వివరించారు. ఈ రెండేళ్ల కాలంలో ఎంతో చేశామని.. విధ్వంసమైన రాష్ట్రాన్ని గాడిలో పెట్టామని చెప్పారు. అదేసమయంలో ప్రజల తలసరి ఆదాయాన్ని పెంచేందుకు కృషి చేశామని వివరించారు. సచివాలయంలో ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఆయా వివరాలను వెల్లడించారు. ఆదాయం రావాలన్నా అభివృద్ధి జరగాలన్నా పెట్టుబడులు రావాలన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో తలసరి ఆదాయం రూ.95,231గా ఉందని, విభజన తర్వాత తెలంగాణ తలసరి ఆదాయం రూ.1,24,104గా ఉండగా… ఏపీ రూ.93,903కు పడిపోయిందని చెప్పారు. రెండు రాష్ట్రాల మధ్య తలసరి ఆదాయంలో రూ.30,201 గ్యాప్ ఏర్పడిందన్నారు. ముఖ్యంగా రాజధానిని కోల్పోవడం వల్ల, ఎక్కువ జనాభా, తక్కువ ఆదాయ వనరులతో రాష్ట్రం ఏర్పడడంతో ప్రజల తలసరి ఆదాయం తగ్గిపోయిందని వివరించారు. ఈ పరిస్థితి నుంచి అభివృద్ధి చేసేందుకు కష్టపడుతున్నామన్నారు.
మరోవైపు 30.5 శాతం మేర సీఏజీఆర్ వృద్ధి జరిగిందని,.. ఇది చారిత్రాత్మకమని సీఎం చంద్రబాబు వివరించారు. “జీఎస్డీపీ 13.5 శాతంగా ఉంది. అప్పుల జీఎస్డీపీ రేషియో 28.38 శాతంగా ఉంది.అభివృద్ధి చేస్తూ రాష్ట్రాన్ని గాడిలో పెట్టగలిగాం కాబట్టి.. ఏపీ, తెలంగాణల మధ్య ఉన్న రిసోర్స్ గ్యాప్ 10 శాతం నుంచి 8 శాతానికి తీసుకురాగలిందని, 2 శాతం మేర గ్యాప్ తగ్గించా“మని చెప్పారు. 2024 ఎన్నికల్లో రాష్ట్రాన్ని పునర్ నిర్మిస్తామని చెప్పామన్న ఆయన.. బ్రాండ్ ఏపీని తిరిగి వచ్చేలా చేస్తామని హామీ ఇచ్చామన్నారు.
ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ప్రయత్నించామని చంద్రబాబు చెప్పారు. వాటిని నెరవేరుస్తున్నామన్నారు.. ఎవ్వరూ ఊహించని విధంగా చెప్పిన విధంగా.. చెప్పిన తేదీల్లో సంక్షేమాన్ని అమలు చేస్తున్నా మన్నారు. “ఆదాయం రావాలంటే అభివృద్ధి రావాలి.. దానికి ప్రాధాన్యత ఇస్తున్నాం. సుస్థిరత కోసం అన్ని రకాల చర్యలు తీసుకున్నాం… కొత్త పాలసీలను ప్రవేశపెట్టాం. రాష్ట్రంలో రెండేళ్ల పాలన, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి మెరుగు పడిందని ముఖ్యమంత్రి వివరించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates