ఉత్త‌రాదిన మోడీ ఇమేజ్‌కు యూత్ చెక్ పెడుతున్నారా?

దేశ‌వ్యాప్తంగా ప్ర‌స్తుతం ఉన్న ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. ఉత్త‌రాది రాష్ట్రాల్లో ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ ఇమేజ్‌కు యువ‌త పెద్ద ఎత్తున చెక్ పెడుతున్నట్టు క‌నిపిస్తోంది. మ‌హారాష్ట్ర‌లో కాక్రోచ్ జ‌న‌తా పార్టీ వ్య‌వ స్థాప‌కుడు అభిజిత్ దీప్కే, ఢిల్లీలో సౌర‌వ్‌దాస్‌, బీహార్‌లో ప్ర‌శాంత్ కిషోర్‌.. పంజాబ్‌, హ‌రియాణాలో కాక్రోచ్ కార్య‌క‌ర్త‌లు పెద్ద ఎత్తున మోడీకి ఇబ్బందిగా ప‌రిణమించార‌న్న వాద‌న వినిపిస్తోంది. అది ప్ర‌స్తుత ప‌రిస్థితిలో ఒక అసాధార‌ణమ‌ని కూడా అంటున్నారు.

ఉత్త‌రాది ప్ర‌భావానికి..

ఉత్త‌రాదిపైనే బీజేపీ రాజ‌కీయాలు ఎక్కువ‌గా సాగుతున్నాయి. అయోధ్య రామమందిరం కావొచ్చు.. యూపీ పాల‌న కావొచ్చు.. మోడీ ప్ర‌భ‌ను భారీగా పెంచాయి. యూపీ స‌హా.. ఇత‌ర ఉత్త‌రాది రాష్ట్రాల్లో బీజేపీ వికాసానికి కూడా ఇవ‌న్నీ దోహ‌ద‌ప‌డ్డాయి. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న ప‌రిస్థితి వేరు.. భ‌విష్య‌త్తు వేర‌నే విధంగా ప్ర‌స్తుతం సంకేతాలు వ‌స్తున్నాయి. ముఖ్యంగా యువ‌త‌లో వ‌స్తున్న మార్పు.. దీనికి కార‌ణంగా క‌నిపిస్తోంది. సంప్ర‌దాయ ఓటు బ్యాంకుకు భిన్నంగా యువ‌త ఆలోచ‌న‌లో మార్పు వ‌స్తోంది.

తాజాగా గుజ‌రాత్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, బీహార్‌లోని ఒక్కొక్క అసెంబ్లీస్థానానికి ఉప ఎన్నిక జ‌రిగింది. అయితే.. గుజ‌రాత్‌లో బీజేపీ త‌న సిట్టింగ్ సీటును నిల‌బెట్టుకున్నా.. గ‌తంలో వ‌చ్చిన మెజారిటీని ఇప్పుడు తెప్పించుకోలేక పోయింది. అలానే మ‌ధ్య ప్ర‌దేశ్‌లో అధికారంలో ఉన్న‌ప్ప‌టికీ.. బీజేపీ తాజా ఉప పోరులో త‌న హ‌వాను చాట‌లేక‌పోయింది. ఇక‌, బీహార్‌లో రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త‌, జ‌న్ సురాజ్ పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు ప్ర‌శాంత్ కిషోర్ ఘ‌న విజ‌యం బీజేపీకి చెమ‌ట‌లు ప‌ట్టించింది.

కేవ‌లం ఇవే కాదు.. భ‌విష్య‌త్తులో చాలా రాష్ట్రాల్లో ఎన్నిక‌లు ఉన్నాయి. వాటిని జ‌యించ‌డం.. అంటే.. ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. బీజేపీకి, ముఖ్యంగా మోడీకి కూడా ఇబ్బంది త‌ప్ప‌ద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇది యువ‌త‌లో వ‌స్తున్న ఆలోచ‌నా ధోర‌ణికి అద్దం ప‌డుతోంద‌ని చెబుతున్నారు. ఒక‌ప్పుడు ప్ర‌త్యామ్నాయాలు లేక పోవ‌డంతో యువ‌త ఏదో ఒక పార్టీకి ఓటేసే ప‌రిస్థితి క‌నిపించింది. కానీ.. ఇప్పుడు ప్ర‌త్యామ్నాయ వ్య‌వ‌స్థ‌లు ఉన్నాయి. వీటికితోడు ఆలోచ‌న చేస్తున్న‌ యువ‌త కూడా క‌నిపిస్తోంది. దీంతో మోడీకి మునుప‌టి కంటే.. ముందు ముందు.. మ‌రిన్ని చిక్కులు త‌ప్ప‌వ‌న్న‌ది విశ్లేష‌కుల అంచ‌నా.