ప్రధాని నరేంద్ర మోదీ వీడియోను ఫేస్బుక్ నుంచి తొలగించిన వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. సోషల్ మీడియా దిగ్గజం మెటా గ్లోబల్ పబ్లిక్ పాలసీ హెడ్ జోయెల్ కప్లాన్కు కేవలం వారం రోజుల వ్యవధిలోనే రెండోసారి సమన్లు జారీ చేసింది. బుధవారం నేరుగా విచారణకు హాజరు కావాలని ఐటీ మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది.
ఈ విచారణకు కప్లాన్ తో పాటు ఇన్స్టాగ్రామ్ సాంకేతిక అధికారులను కూడా తప్పనిసరిగా రావాలని కేంద్రం ఆదేశించింది. మెటా ప్లాట్ఫామ్లలో అల్గారిథమ్ అసలు ఏ విధంగా పనిచేస్తుందో వారి నుంచి వివరంగా తెలుసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసే పోస్టులకు సోషల్ మీడియాలో ఎక్కువ వ్యూస్ వస్తున్నాయంటూ ఇప్పటికే అనేక ఫిర్యాదులు అందాయి. దీని వెనుక ఏదైనా ఉద్దేశపూర్వక కుట్ర ఉందా అనే కోణంలో అధికారులు ప్రశ్నించనున్నారు.
గత వారంలో కూడా ఇదే ఇష్యూపై కేంద్ర సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ కప్లాన్కు నోటీసులు ఇచ్చింది. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా దేశ ప్రధాని వీడియోను ఎందుకు డిలీట్ చేశారని ఆ సమయంలో ఆరా తీస్తోంది. అంత కీలకమైన వీడియో తొలగిపోయేంత పెద్ద టెక్నికల్ సమస్యలు ఎందుకు వస్తున్నాయో వివరణ ఇవ్వాలని కోరింది.
ఇక ప్రధాని వీడియోను తొలగించిన ఘటనలో మెటా సంస్థ అధినేత మార్క్ జుకర్ బర్గ్ నుంచి రాతపూర్వక క్షమాపణ కోరే అవకాశం ఉన్నట్లు సమాచారం. జరిగిన పొరపాటును అంగీకరిస్తూ సంస్థ తరఫున ఒక అధికారిక లేఖ ఇవ్వాలని అధికారులు పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు ఆ వీడియో డిలీట్ అవ్వడానికి దారితీసిన అసలు సాంకేతిక లోపం ఏంటో వివరిస్తూ మరో నివేదికను సమర్పించాలని మెటా ప్రతినిధులను ఆదేశించనున్నారు.
ఈ పరిణామాలను గమనిస్తే సోషల్ మీడియా సంస్థల వ్యవహారశైలిపై కేంద్రం చాలా సీరియస్గా ఉన్నట్లు అర్థమవుతోంది. సాంకేతిక లోపాల సాకుతో ప్రధాని స్థాయి వ్యక్తికి చెందిన కంటెంట్ను తీసేయడాన్ని ప్రభుత్వం ఏమాత్రం ఉపేక్షించడం లేదు. ఇక బుధవారం జరగబోయే కీలక సమావేశంలో మెటా ప్రతినిధులు ఇచ్చే రాతపూర్వక వివరణ వివాదానికి ఒక శాశ్వత ముగింపు పలికే ఛాన్స్ ఉంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates