గ్రేటర్ పాలక మండలిలో మగాళ్ల కంటే మహిళలే అధికం

నిన్న (గురువారం) కొలువు తీరిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పాలకమండలిని చూసినప్పుడు ఆసక్తికరమైన అంశం ఒకటి దర్శనమిచ్చింది. మొత్తం 150 మంది కార్పొరేటర్లు ఉన్న జీహెచ్ఎంసీలో మగాళ్లను మహిళలు ఓడించారు. రిజర్వేషన్ ప్రకారం చూసినప్పుడు 50 శాతం మహిళలు అన్నది అమలు చేసినప్పుడు 75 మంది మహిళా కార్పొరేటర్లు ఎన్నిక కావాల్సి ఉంటుంది. అయితే.. ఈసారి 80 మంది మహిళలు ఎన్నికయ్యారు.

దీంతో 150 మంది కార్పొరేటర్లలో సగం కంటే ఎక్కువగా మహిళలు దర్శనమిచ్చారు. ఇలాంటి సందర్భం చాలా తక్కువగా ఉంటుందని చెబుతున్నారు. రిజర్వేషన్ విధానంలో ఈసారి మేయర్ గా మహిళను ఎంపిక చేసుకోవాల్సి రావటం.. అనూహ్యంగా డిప్యూటీ మేయర్ ను కూడా మహిళనే ఎంపిక చేయటంతో.. నగరానికి ప్రధమ.. ద్వితీయ రెండు స్థానాలు మహిళలే నిలిచారు.

అంతేకాక.. సగాని కంటే ఎక్కువ కార్పొరేటర్లు మహిళలే కావటంతో.. గ్రేటర్ పాలక మండలి వరకు మగాళ్లను తోసి రాజన్నట్లుగా మహిళలు మారారు. పురుషాధిక్య సమాజంలో.. అందునా రాజకీయాల్లో మహిళలకు అవకాశం అంతంత మాత్రంగా లభించే రోజుల్లో.. అందుకు భిన్నంగా గ్రేటర్ పాలక మండలి మొత్తం మహిళలదే రాజ్యమన్నట్లుగా మారటం విశేషం. మొత్తానికి గ్రేటర్ మగాళ్లను ఓడించిన గ్రేటర్ మహిళలు మారారు. ఇది అరుదైనదిగా చెప్పక తప్పదు.