అమరావతిలో పొట్టి శ్రీరాములు స్మృతి వనాన్ని సందర్శించిన అనంతరం జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో తెలంగాణ అనే భావన, తమిళనాడులో ప్రాంతీయ భావన ఉంటుందని అన్నారు. కానీ, ఆంధ్రాలో ఆంధ్రా అన్న భావన ఉండదని, ఏ భావన ఉందో ఎవరికీ తెలీదని పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రాలో కుల భావన ఉందని అన్నారు. జై అమరావతి అంటే ఒక ప్రాంతానికే పరిమితం అవుతుందని, అందుకే జై ఆంధ్రా అని తాను అన్నానని అన్నారు. జై ఆంధ్రా అంటూ ఉన్మాద స్థాయికి వెళ్లమని తాను చెప్పడం లేదని, కానీ, ఒక గుర్తింపు ఉండాలని, అది రాష్ట్రానికి మంచిదని అన్నారు. భారతీయతను ఎక్కడా కోల్పోమని తాను చెప్పడం లేదని తెలిపారు.
ఈ కుల దూషణలకు చరమ గీతం పాడాలి అనుకుంటున్నామని, అందుకు సంబంధించి జనసేన తరఫున సేనాగళం అనే కమిటీ ఏర్పాటు చేశామని అన్నారు. ఏ కులం వారిని దూషించినా ఈ సేనాగళం స్పందిస్తుందని చెప్పారు. కులాలవారీగా పార్టీలోని నేతలను విభజించాలని కుట్ర పన్నే వారికి సేనాగళం కమిటీ దీటైన సమాధానమిస్తుందన్నారు.
ఇక, రాజకీయాల్లో కుల దూషణలు ఎక్కువయ్యాయని, వైసీపీ పాలనలో అవి పరాకాష్టకు చేరాయని పవన్ అన్నారు. వైసీపీ హయాంలో ఆఖరికి జర్నలిస్టులకు కూడా కులాలు ఆపాదించి కులాలవారీగా దూషణలకు దిగారని పవన్ ఆరోపించారు. ఈ కుల దూషణలు ఇలాగే కొనసాగితే పాలన సాగించడం కూడా కష్టమవుతుందని అన్నారు.
దళిత యువకుడిని వైసీపీ ఎమ్మెల్సీ హత్య చేసి డోర్ డెలివరీ చేస్తే ఆ ఎమ్మెల్సీని వెనకేసుకు వచ్చారని, ఆ సమయంలో దళిత సంఘాలు మాట్లాడలేదని విమర్శించారు. డాక్టర్ సుధాకర్ ను మాససికగంగా వేధించారని, ఆ సమయంలో దళిత సంఘాలు రాలేదని గుర్తు చేశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates