వైసీపీ అధినేత జగన్ తాజాగా బుధవారం తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో పర్యటించారు. ఇక్కడి పొగాకు రైతులను ఆయన పరామర్శించారు. తొలుత తాడేపల్లి నుంచి ప్రత్యేక ప్రైవేటు హెలికాప్టర్లో నేరుగా దేవరపల్లికి చేరుకున్న జగన్ ఎలాంటి ర్యాలీలు లేకుండానే.. ఎలాంటి జన సమీకరణ చేయకుండానే నేరుగా పొగాకు మార్కెట్ యార్డుకు చేరుకున్నారు. దీనికి పక్కనే హెలిప్యాడ్ను అధికారులు ఏర్పాటు చేశారు. అయితే.. ఇక్కడే పెద్ద సమస్య వచ్చింది. ఇదే రాజకీయంగా అటు వైసీపీ, ఇటు టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. పొలిటికల్ రచ్చకు కారణమైంది.
వాస్తవానికి జగన్ ఎక్కడకు వచ్చినా.. ముందుగా ర్యాలీలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. వేలాది మందితో జనసమీకరణ చేస్తున్నారు. కారు ఫుట్ బోర్డుపై నిలబడి దండాలు పెడుతూ.. కిలో మీటర్ల దూరం ప్రయాణించి బల ప్రదర్శన చేస్తున్నారు. దీంతో ఈ వ్యవహారాలు ఇబ్బందిగా మారుతున్నాయి. పోలీసులు కూడా అనుమతి లేదని చెబుతున్నారు. ఇటీవల శ్రీకాకుళంలో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును జైల్లో పరామర్శించేందుకు వెళ్లిన జగన్.. ర్యాలీగా జైలుకు చేరుకోవడంతో అప్పటికే సమయం ముగిసింది. దీంతో వెనుదిరిగారు. పైగా.. పలు కేసులు కూడా నమోదయ్యాయి.
ఈ పరిణామాల నేపథ్యంలో తాజాగా తూర్పు పర్యటనలో ర్యాలీలకు ప్రాధాన్యం ఇవ్వకుండా నేరుగా దేవరపల్లికి చేరుకున్నారు. అయితే.. ఇక్కడ ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ చుట్టూ భారీ స్థాయిలో రక్షణ కంచెను పోలీసులు నిర్మించారు. జగన్ హెలికాప్టర్లో అక్కడకు చేరుకున్నాక.. ప్రత్యేక కాన్వాయ్ లో మార్కెట్ యార్డుకు వెళ్లాలి. అయితే.. అనూహ్యంగా పోలీసులు ఏర్పాటుచేసిన బారికేడ్లు, ఇనుప కంచెను కూడా దాటుకుని వైసీపీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హెలికాప్టర్ వద్దకు దూసుకు వచ్చారు. ఈ పరిణామాలతో కొద్దిసేపు జగన్ హెలికాప్టర్లోనే ఉండిపోయారు. అనంతరం.. మాజీ మంత్రులు.. చేయిచేయి పట్టుకుని జగన్కు భద్రతగా నిలిచారు. అనంతరం ఆయన కాన్వాయ్లో మార్కెట్ యార్డుకు చేరుకున్నారు.
వైసీపీ వర్సెస్ టీడీపీ
జగన్కు భద్రత విషయంలో కూటమి ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా ఉందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. పోలీసులు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆయన ఆరోపించారు. ఉదయం నుంచి 10 గంటల వరకు హెలీప్యాడ్ వద్ద ఉన్న పోలీసులు సరిగ్గా జగన్ వచ్చే సమయానికి లేకుండా పోయారని ఆరోపించారు. తాను స్వయంగా డీజీపీకి ఫోన్ చేసినా ఆయన లిఫ్టు చేయలేదన్నారు. మరో మాజీ మంత్రి కూడా పోలీసులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించే బదులు.. “టీడీపీ రంగు చొక్కాలు వేసుకుంటే సరిపోతుంది“ అని ఘాటుగా వ్యాఖ్యానించారు. జగన్కు భద్రత కల్పించకపోవడాన్ని తాము కోర్టు దృష్టికి తీసుకు వెళ్తామని చెప్పారు. జడ్+ భద్రతలో ఉన్న జగన్కు భద్రత కల్పించకపోవడం క్రిమినల్ నేరమేనని ఆయన వ్యాఖ్యానించారు.
టీడీపీ నేతలు ఈ వ్యాఖ్యలపై ఎదురు దాడి చేశారు. జగన్ పర్యటన అంటే.. పోలీసులే భయపడే పరిస్థితి ఏర్పడుతోందని అన్నారు. శ్రీకాకుళంలో మహిళా ఎస్సైపై దాడి చేసి.. పోలీసు వ్యవస్థను నీరుగార్చే ప్రయత్నం చేశారని అన్నారు. రైతులను పరామర్శించేందుకు వచ్చారా? లేక బలప్రదర్శనకు వచ్చారా? అని ప్రశ్నించారు. రైతులను పరామర్శించేందుకు వచ్చిన వారు జన సమీకరణ ఎందుకు చేయాల్సి వచ్చిందని ప్రశ్నించారు. తప్పంతా వైసీపీదేనని.. పోలీసులకు కేవలం 500 మంది మాత్రమే వస్తారని చెప్పారని, కానీ.. 5 వేల మంది వచ్చారని, దీనిలో పోలీసుల వైఫల్యం లేదని వైసీపీ వైఫల్యమే ఉందని ఆరోపించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates