యువ కథానాయకుడు సందీప్ కిషన్ కెరీర్లో సక్సెస్ రేట్ తక్కువే అయినా.. అవకాశాలకేమీ లోటుండదు. ఎప్పుడూ చేతిలో రెండు మూడు సినిమాలు పెట్టుకునే ఉంటాడు. తెలుగులోనే కాదు.. తమిళంలోనూ అతడికి మంచి డిమాండే ఉంది. మంచి బడ్జెట్లు పెట్టి సినిమాలు తీస్తుంటారు నిర్మాతలు. ఇప్పటికే తెలుగులో ‘పవర్ పేట’ అనే పెద్ద బడ్జెట్ సినిమా చేస్తున్నాడు సందీప్. ఇక తమిళంలో సీఎం విజయ్ తనయుడు జేసన్ విజయ్ దర్శకత్వంలో నటించిన ‘సిగ్మా’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పుడు సందీప్ నుంచి ఇంకో భారీ చిత్రం అనౌన్స్ అయింది. ఆ సినిమానే.. కరికాల.
గత ఏడాది ‘శంబాల’ చిత్రంతో అందరి దృష్టినీ ఆకర్షించాడు యుగంధర్ ముని. అతడి తొలి చిత్రం ‘ఎ (యాడ్ ఇన్ఫినిటమ్) కూడా మంచి ప్రయోగంగా గుర్తింపు తెచ్చుకుంది. ‘శంబాల’ మంచి హిట్ కావడంతో యుగంధర్పై నిర్మాతలకు గురి కుదిరింది. ‘శంబాల’ను ప్రొడ్యూస్ చేసిన మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నాభిమోజులే.. యుగంధర్ ముని, సందీప్ కిషన్ల కలయికలో రాబోతున్న ‘కరికాల’ను కూడా నిర్మిస్తున్నారు. ఈ రోజే ఈ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ లాంచ్ చేశారు. రెండూ ఆకర్షణీయంగానే ఉన్నాయి.
సింహాన్ని తరుముతూ గుర్రం మీద దూసుకొస్తున్న యోధుడి అవతారంలో సందీప్ కిషన్ ఆకట్టుకున్నాడు. ‘కరికాల’కు ‘ఎ మ్యాజికల్ వరల్డ్’ అనే క్యాప్షన్ పెట్టారు. దీన్ని బట్టి ఒక అద్భుత ప్రపంచంలోకి ప్రేక్షకులను విహరిపంజేయబోతున్నామని సంకేతాలు ఇచ్చినట్లయింది. సినిమా అనౌన్స్మెంట్లోనే ఇది రెండు భాగాలుగా వస్తుందని చెబుతూ.. రెండు భాగాల రిలీజ్ డేట్లను కూడా అనౌన్స్ చేయడం విశేషం. చాప్టర్-1 2027 జులై 2న, చాప్టర్-2 అదే ఏడాది అక్టోబరు 28న సుమారు నాలుగు నెలల గ్యాప్ తో రిలీజవుతాయని ప్రకటించారు. మరి సందీప్ కెరీర్లోనే అత్యంత భారీగా తెరకెక్కనున్న ‘కరికాల’ అతడి కెరీర్ను మరోస్థాయికి తీసుకెళ్తుందేమో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates