ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో ఒక్క డీఎస్సీ నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదు, ఒక్క ఉపాధ్యాయ నియామకాన్ని కూడా చేపట్టలేదు… కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 16 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తూ డీఎస్సీ నిర్వహించింది. గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా పలు డీఎస్సీల ద్వారా ఉపాధ్యాయ నియామకాలు చేపట్టిన విషయం తెలిసిందే.
అయితే, ఇటీవల నిర్వహించిన డీఎస్సీలో భారీ అక్రమాలు జరిగాయంటూ నియామక ప్రక్రియ పూర్తై దాదాపు తొమ్మిది నెలలు గడిచిన తర్వాత వైసీపీ ఆందోళనలకు దిగడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. నియామక ప్రక్రియ జరుగుతున్న సమయంలో కాకుండా, నియామకాలు పూర్తై ఉపాధ్యాయులు విధుల్లో చేరిన అనంతరం ఈ అంశాన్ని తెరపైకి తీసుకురావడం వెనుక ఉద్దేశమేంటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
ఇతర ప్రజా సమస్యల కంటే డీఎస్సీ అంశంపైనే వైసీపీ ప్రత్యేకంగా దృష్టి సారించడం వెనుక రాజకీయ వ్యూహం ఉందా అనే చర్చ జరుగుతోంది. గతంలో ఉపాధ్యాయ నియామకాలు చేపట్టని పార్టీ, ఇప్పుడు డీఎస్సీపై నిరసనలు చేపట్టడం విరుద్ధ వైఖరిగా ఉందని కూటమి నాయకులు విమర్శిస్తున్నారు.
డీఎస్సీ నియామకాలపై సీబీఐ విచారణ జరపాలని కోరుతూ వైసీపీ కోర్టును కూడా ఆశ్రయించింది. వారు వేసిన పిల్ను కోర్టు కొట్టివేసింది. అయినా రిలే నిరాహార దీక్షల పేరిట రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ ఒక ఉద్యమాన్ని నడుపుతోంది. ఇది జనం చేస్తున్న ఉద్యమం అంటూ కలరింగ్ కూడా ఇస్తోంది.
గత మెగా డీఎస్సీ ఫైల్పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొదటి సంతకం పెట్టారు. డీఎస్సీకి దరఖాస్తు చేసిన వారు సుమారు 3.35 లక్షల మంది. అందులో ప్రతిభ సాధించి ఉద్యోగం పొందిన వారు 16 వేల మంది. మిగిలిన వారిలో విజయానికి అతి దగ్గరగా వచ్చి పోస్టులు పొందలేకపోయిన వారు కూడా ఉన్నారు. వారిని మాత్రమే వైసీపీ టార్గెట్ చేసినట్లు భావించాల్సి ఉంటుంది.
కొద్దిలో మిస్ అయిన వారిలో లేనిపోని అనుమానాలు రేకెత్తించి రెచ్చగొడుతున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇవి స్వయానా అధికారులు చెబుతున్న మాటలు. గతంలో ఉన్నతాధికారులు ప్రెస్మీట్ పెట్టి మరీ డీఎస్సీ అభ్యర్థులకు వివరణ కూడా ఇచ్చారు. జగన్ ప్రెస్మీట్లో పాల్గొన్న డీఎస్సీ అభ్యర్థులకు ఎందుకు పోస్టులు రాలేదో వారు విడమర్చి చెప్పారు. మరోవైపు మంత్రి నారా లోకేషన్ వైసిపి టార్గెట్ చేసిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
కేంద్రంలో ధర్మేంద్ర ప్రధాన్ ఏ విధంగా రాజీనామా చేశారో, అదే విధంగా ఏపీలో నారా లోకేష్ రాజీనామా చేయాలని పట్టుబడుతున్నారు. అయితే వైసీపీ వాదనల్లో బలం లేనట్లు అనిపిస్తోంది. కోర్టులు కూడా విచారణకు స్వీకరించకపోవడం అందుకు నిదర్శనం. భారీ డీఎస్సీని నిర్వహించి అభ్యర్థుల అభిమానాన్ని కూటమి ప్రభుత్వం పొందింది. మరో డీఎస్సీ నిర్వహించేందుకు కూడా సిద్ధం అవుతోంది. జగన్ మాత్రం అవకతవకలు జరిగాయంటూ ప్రచారం చేస్తున్నారు. డీఎస్సీ సాధించిన విద్యార్థులు మాత్రం ఆ ఆరోపణలను తిప్పికొడుతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates