జార్ఖండ్ లో మరో సోనమ్ వాంగ్ చుక్ దీక్ష

దేశంలో ఎక్కడ చూసినా విద్యార్థి ఉద్యమాలు జరుగున్నాయి. ఢిల్లీ నుంచి మొదలుపెట్టుకొని ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, జార్ఖండ్, బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో విద్యార్థులు వీధి పోరాటాలు చేస్తున్నారు. ప్రధానంగా నీట్ పేపర్ లీకేజి వ్యవహారం దేశాన్ని కుదిపేసింది. ఉత్తరం, దక్షిణం అనే తేడాలు లేకుండా యావత్ భారత దేశంలోని విద్యార్థి, యువజనులు ఢిల్లీలో జరిగిన జంతర్ మంతర్ ఉద్యమంలో పాల్గొన్నారు.

పోలీసుల లాఠీ దెబ్బలు తిన్నారు, అసాంఘిక శక్తుల దాడులు ఎదుర్కొన్నారు. మొత్తం మీద విజయం సాధించారు. ఇప్పుడు అదే క్రమంలో జార్ఖండ్ రాష్ట్రంలో విద్యార్థుల ఉద్యమం జరుగుతుంది. సోనమ్ వాంగ్ చుక్ తరహాలో దేవేంద్రనాథ్ మహాతో ఆమరణ దీక్ష చేపట్టారు. దాంతో జార్ఖండ్ లో అధికార జేఎంఎం, ప్రతిపక్ష బీజేపీ వణికి పోతున్నాయి.

జార్ఖండ్ లో ఈ ఏడాది ఏప్రిల్ లో జేపీఎస్సి 14 వ కంబైండ్ సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షల్లో క్వాలిఫై కావాలంటే 200 మార్కులకు గాను 144 మార్కులు రావాల్సి ఉంటుంది. అయితే పేపర్ 1లో కేవలం 48 మార్కులు వచ్చిన అభ్యర్థికి ఉద్యోగం వచ్చింది. ఇది విద్యార్థుల్లో ఆగ్రహం తెప్పిందించింది. దీనికితోడు కట్ ఆఫ్ మార్కులు ప్రకటించలేదు. మెరిట్ లిస్టు పై జేపీఎస్సి సభ్యుల సంతకాలు లేవు. జార్ఖండ్ ప్రభుత్వం గతంలో బ్లాక్ లిస్టులో పెట్టిన టీడిపీఎల్ ఏజెన్సీకి సోరెన్ ప్రభుత్వం పరీక్షల నిర్వహణ బాధ్యతలను అప్పగించింది. దీంతో విద్యార్థి, యువజనులు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు.

సరిగ్గా ఈ సమస్యల మీదనే దేవేంద్రనాథ్ మహాతో ఆమరణ దీక్షకు దిగారు. జేపీఎస్సి కార్యాలయం సమీపంలోని ఓల్డ్ జైల్ చౌక్ వద్ద దీక్ష జరుగుతుంది. మహాతోకు సంఘీభావంగా జైపాల్ సింగ్ ముండా స్టేడియం వద్దకు విద్యార్థులు భారీగా చేరుకుంటున్నారు. మహాతో ప్రస్తుతం లోక్ తాంత్రిక్ క్రాంతికారి మోర్చా ఉపాధ్యక్షుడిగా వ్యవహారిస్తున్నారు. గతంలో జార్ఖండ్ స్టేట్ స్టూడెంట్స్ యూనియన్ ను నడిపించిన అనుభవం వుంది. 2024 లోక్ సభ ఎన్నికల్లో రాంచీ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. మహాతో ఇప్పుడు అత్యంత ప్రజాదారణ కలిగిన నాయకుడిగా యువతలో స్థానం సంపాదించారు.

దేవేంద్రనాథ్ మహాతో ఉద్యమం జార్ఖండ్ లోని ప్రధాన రాజకీయ పార్టీల్లో గుబులు రేకెత్తిస్తుంది. మహాతోకు వస్తున్న ఆదరణ చూసి అధికార జేఎంఎం, ప్రతిపక్ష బీజేపీ పార్టీలు వణికిపోతున్నాయి. జంతర మంతర్ తర్వాత దేశంలో ఎక్కడ పేపర్ లీకేజి మాట వినిపించినా కేంద్రంలోని మోదీ సర్కార్ ఉలిక్కి పడుతుంది. నేరుగా యువ ఓటర్ల మీద ప్రభావం చూపించే అవకాశం ఉండటంతో అంతిమంగా అది బీజేపీకి నష్టం కలిగిస్తుందని రాజకీయ విశ్లేషకులు సైతం వ్యాఖ్యనిస్తున్నారు. దీంతో జార్ఖండ్ లో బీజేపీ కూడా జేపీఎస్సి అక్రమాలఫై విచారణ చేయాలని డిమాండ్ చేస్తుండటం గమనార్హం.