ప్రధాని పిలుపు ఆచరణ సాధ్యమేనా ?

మన్ కీ బాత్ లో మాట్లాడిన ప్రధానమంత్రి నరేంద్రమోడి స్వదేశీ వస్తువుల వాడకాన్ని ప్రోత్సహించాలంటు పిలుపునిచ్చారు. ఈ విధమైన పిలుపివ్వటం మోడి ఇది రెండోసారి. జమ్మూ-కాశ్మీర్ సరిహద్దుల్లో డ్రాగన్ దేశంతో పెరిగిపోతున్న వివాదాల తర్వాతే ప్రధానికి స్వదేశీ వస్తువుల వాడకంపై ఆలోచన వచ్చింది. ఈ సందర్భంగానే ఆలోచన ఎందుకు వచ్చిందంటే మనదేశంలో వాడుతున్న చాలా వస్తువుల్లో అత్యధికం చైనా ఉత్పత్తులే కాబట్టి.

వాణిజ్యపరంగా డ్రాగన్ తో చేసుకున్న ఒప్పందాల కారణంగా కొన్ని వస్తువులను ఎగుమతి చేస్తున్నాం. మరెన్నో వస్తువులను దిగుమతి చేసుకుంటున్నాం. ఈ లెక్కన చూస్తే మనం దిగుమతి చేసుకుంటున్న వస్తువులే చాలా ఎక్కువగా ఉంటున్నాయి. టీవీలు, వాషింగ్ మెషీన్లు, మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్ లో వాడే రూటర్లు, వాచీలు, షూసు, చెప్పులు, కుక్కర్లు, బల్బులు, ఫ్యాన్లు ఇలా చెప్పుకుంటూ పోతే మనదేశ మార్కెట్ ను చైనా ముంచెత్తుతోందన్నది వాస్తవం.

ప్రతి సంవత్సరం కొన్ని లక్షలకోట్ల రూపాయల చైనా వ్యాపారానికి మనదేశం అతిపెద్ద మర్కెట్ అయిపోయింది. ఇన్ని లక్షల కోట్ల రూపాయల మార్కెట్ వస్తువులకు ప్రత్యామ్నయం ఒక్కసారిగా సాధ్యంకాదు. దశాబ్దాల పాటు మనం చైనా వస్తువులకు అలవాటు పడిపోయున్నాం. అలాంటిది ఒక్కసారిగా చైనా వస్తువులు కొన్నద్దంటే ఆచరణ సాధ్యం కాదన్న విషయం తెలిసిందే. చైనా వస్తువులు కొనద్దని చెప్పటం చాలా తేలికే. కానీ వాటికి ప్రత్యామ్నాయంగా మనదేశంలో అటువంటి ఉత్పత్తులు, అంతే నాణ్యతతో ఉత్పత్తవుతున్నాయా ? అన్నదే ప్రధానం.

ఏరకంగా చూసినా చైనా వస్తువులకు దీటుగా తయారవుతున్న వస్తువులు మన దగ్గర లేవనే చెప్పాలి. టీవీలు, మొబైళ్ళు, ల్యాపుటాపులు, రూటర్లు, వాచీలు ఇలా ఏది తీసుకున్నా మన దగ్గరే తయారవుతున్న ప్రత్యామ్నాయం తక్కువనే చెప్పాలి. చైనా వస్తువుల్లో ఉన్న సౌలభ్యం ఏమిటంటే నాణ్యతతో బాగా చవుకగా దొరుకుతున్నాయి. మనదగ్గర కూడా మైక్రోమ్యాక్స్ లాంటి మొబైళ్ళు తయారవుతున్నా మళ్ళీ వాటి మదర్ బోర్టులు చైనా తయారీనే అని గుర్తుంచుకోవాలి. ఏ రంగంలో చూసినా మనదేశాన్ని చైనా ఉత్పత్తులు ముంచెత్తుతున్నాయి.

ముందు చైనా ఉత్పత్తులకు ప్రత్యామ్నాయంగా మన ఉత్పత్తులను మొదలుపెట్టిన తర్వాత స్వదేశీ వస్తువులను వాడండని ప్రధాని పిలుపిచ్చినా బాగుంటుంది. అలా కాకుండా స్వదేశీ వస్తువులనే వాడమని చెబుతు, తయారీని మాత్రం పట్టించుకోకపోతే జనాలు అనివార్యంగా చైనా వస్తువులపైనే ఆధారపడటం ఖాయం. మరి వాణిజ్య ఒప్పందాలను ఉల్లంఘించి చైనా వస్తువుల దిగుమతిని కేంద్రప్రభుత్వం నిషేధిస్తుందా ? చూద్దాం ప్రధాని ఏమి చేస్తారో.