ఏపీ సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్లు సుమారు గంటకుపైగా చర్చలు జరిపారు. బుధవారం ఉదయం ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి వచ్చిన పవన్ కల్యాణ్.. సీఎంతో సుదీర్ఘ చర్చలు జరిపారు. ప్రస్తుతం తెరమీదికి వచ్చిన అనేక అంశాలపై వారు దృష్టి పెట్టారు. అదేసమయంలో వైసీపీ కుల రాజకీయాలను ప్రోత్సహిస్తుండడంపైనా చర్చించారు. ఈ విషయాలను ఆషామాషీగా వదిలేయడానికి వీల్లేదని బలమైన ఎదురు దాడితోనే నిలువరించాలని ఇరువురు నిర్ణయించారు.
ఇవీ అంశాలు!
1) కల్తీ నెయ్యి: తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగం.. అనంతరం చేపట్టిన దర్యాప్తు.. సిట్ ఇచ్చిన నివేదికలోని అంశాలపై మరోసారి చంద్రబాబు, పవన్ చర్చించారు. మంగళవారం కేబినెట్ లో చర్చకు వచ్చిన అంశాలతో పాటు వ్యక్తిగతంగా పార్టీల తరఫున ప్రజల మధ్యకు ఏయే అంశాలను తీసుకువెళ్లాలన్న విషయంపై ఇరువురు నేతలు దృష్టి పెట్టారు. పార్టీల పరంగా కూడా కల్తీ విషయాన్ని ప్రజల మధ్యకు తీసుకు వెళ్లాలని నిర్ణయించారు.
2) తిరుమల పవిత్రత: తిరుమల పవిత్రతను వైసీపీ ప్రభుత్వం ఏవిధంగా భ్రష్టు పట్టించిందో ఆధారాలతో సహా ప్రజల మధ్యకు తీసుకువెళ్లాలని సీఎం చంద్రబాబు, పవన్ నిర్ణయించారు. శ్రీవారి దర్శన టికెట్ల నుంచి ప్రసాదాల వరకు కూడా.. అనేక రూపాల్లో నాటి పాలక మండలి సభ్యులు భక్తుల మనోభావాలను దెబ్బతీశారని… ఆ వివరాలను ఇప్పుడు ప్రజలకు బహిర్గతం చేయాలని నిర్ణయానికి వచ్చారు.
3) కులాల మధ్య చిచ్చు: అంబటి రాంబాబు అరెస్టు తర్వాత.. వైసీపీ నాయకులు కాపు అజెండాను బయటకు తీసుకురావడంపైనా చర్చ జరిగింది. ప్రధానంగా కులాల మధ్య చిచ్చు పెట్టే విధంగా వ్యవహరించడంపై సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పార్టీల పరంగానే కాకుండా.. సామాజిక వర్గాల పరంగా కూడా.. దీనిని ఎండగట్టాలని.. వైసీపీ కుల రాజకీయాలను ప్రజల మధ్య చర్చ పెట్టాలని నిర్ణయానికి వచ్చారు. దీనికి సంబంధించి కార్యాచరణను ఖరారు చేసినట్టు తెలిసింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates