సీబీఐకి ఇస్తే.. పోయేదేంటి?: బీఆర్ ఎస్ చర్చ

కాళేశ్వరం అవినీతి, అక్రమాల నిగ్గు తేల్చేందుకు నియమించిన పినాకి చంద్రఘోష్ (పీసీ ఘోష్) కమిషన్ రిపోర్టుపై చర్చ అనంతరం తెలంగాణ అసెంబ్లీ దీనిపై సీబీఐ విచారణ జరిపించేలా నిర్ణయించింది. దీనిపై కేంద్రానికి లేఖ రాయనున్నారు. ఏయే విషయాల్లో అక్రమాలు జరిగాయో, ఎలాంటి అక్రమాలో వివరించడంతోపాటు ఎంత దుర్వినియోగం జరిగిందో, ఎవరు లబ్ధి పొందారని అనుమానిస్తున్నారన్న విషయాలను కూడా పేర్కొంటూ కేంద్ర హోంశాఖకు లేఖ రాయనున్నారు. అనంతరం దీనిపై సీబీఐ దృష్టి పెట్టనుంది.

అయితే వాస్తవానికి ఇలా కీలకమైన కేసులో సీబీఐ విచారణకు ఆదేశించడాన్ని నాయకులు చిన్నబుచ్చుకుంటారు. తమ ఇమేజ్ పోతుందనే అనుకుంటారు. కానీ బీఆర్ ఎస్‌లో మాత్రం “అయితే ఏంటి? సీబీఐకి ఇస్తే పోయేదేంటి?” అనే కామెంట్లు చేయడం గమనార్హం. అంతేకాదు సీబీఐకి ఇచ్చి మంచి పనిచేశారని ఒకరిద్దరు నాయకులు కూడా వ్యాఖ్యానించారు. ఎందుకంటే దేశంలో సుదీర్ఘకాలంగా విచారణలో ఉన్న కేసులు ఏవంటే అవి సీబీఐవే. ఏపీ మాజీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసు 14 సంవత్సరాలు అయినా ఇప్పటి వరకు కొలిక్కి రాలేదు.

ఇక జగన్ బాబాయి వివేకా దారుణ హత్య కేసు కూడా సీబీఐకి అప్పగించినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందని ఆయన కుమార్తె సునీత వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. కాబట్టి ఈ విషయాలను పరిగణనలోకి తీసుకుంటే సీబీఐ విచారణ అంటేనే దీనిని సాగదీత కోణంలోనే చూస్తారన్నది బీఆర్ ఎస్ నాయకుల మాట. అందుకే “సీబీఐకి ఇస్తే పోయేదేంటి?” అన్న చర్చకు తెరదీశారు. ఇక దీనిపై పార్టీ సుప్రీం కేసీఆర్ ఏమంటారో చూడాలి. ఆయన ఇంకా దీనిపై స్పందించలేదు.

కట్ చేస్తే సీబీఐ విచారణకు ఇప్పుడు ఇచ్చినా ప్రభుత్వం దీనికి సంబంధించిన కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. దీనిపై ఇప్పటికి ప్రభుత్వానికి అందిన పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టులోని అంశాలను ప్రాతిపదికగా చేసుకుని విచారణ చేయాలా? లేక ఆది నుంచి విచారణ చేపట్టాలా? అనే విషయాలపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఒకవేళ ఆది నుంచి కనుక విచారణ చేపట్టాలని భావిస్తే ఈ కేసు మరో జగన్ కేసు మాదిరిగా మారడం ఖాయమన్న వాదన వినిపిస్తోంది.