ఇక‌ అవినాష్ వంతు.. అరెస్టు కోరుతూ ‘సిట్‌’ పిటిష‌న్‌

వైసీపీ హ‌యాంలో జ‌రిగిన మ‌ద్యం కుంభ‌కోణంపై విచార‌ణ చేస్తున్న ప్ర‌త్యేక ద‌ర్యాప్తుబృందం ఇప్ప‌టికి రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డితో పాటు 12 మందిని అరెస్టు చేసిన విష‌యం తెలిసిందే. వీరిలో 11 మంది విజ‌య‌వాడ జైల్లో ఉండ‌గా.. మిథున్‌రెడ్డి మాత్రం రాజ‌మండ్రి జైల్లో ఉన్నారు. అయితే..ఈ అరెస్టులు ఇప్ప‌టితో ఆగేలా క‌నిపించ‌డం లేదు. మ‌రో 12 మంది నిందితుల‌ను అరెస్టు చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని.. పేర్కొంటూ.. తాజాగా విజ‌య‌వాడ ఏసీబీ కోర్టులో ప్ర‌త్య‌క ద‌ర్యాప్తు బృందం అధికారులు పిటిష‌న్ దాఖ‌లు చేశారు. దీనిలో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి పేరు ఉండ‌డం సంచ‌ల‌నంగా మారింది.

వాస్త‌వానికి ఇప్ప‌టి వ‌ర‌కు అవినాష్ రెడ్డి పేరు ఉన్న‌ట్టు తెలియ‌దు. ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న‌ను విచారించిన దాఖ‌లా కూడా లేదు. కానీ, తాజాగా కోర్టుకు స‌మ‌ర్పించిన పిటిష‌న్‌లో ఏ7గా ఉన్న అవినాష్ రెడ్డి స‌హా.. ఏ40గా ఉన్న‌ పురుషోత్తం, ఏ41 అయిన‌ అనిరుద్ రెడ్డి, ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి, షేక్ సైఫ్, బొల్లారం శివ, సైమన్, రాజీవ్ ప్రతాప్, కొమ్మారెడ్డి అవినాష్ రెడ్డి, మోహన్ కుమార్, అనిల్ కుమార్ రెడ్డి, సుజల బెహ్రెన్ పేర్ల‌ను పేర్కొన్నారు. వీరిని కూడా అరెస్టు చేయాల్సి ఉంద‌ని.. మ‌ద్యం కుంభ‌కోణంలో వీరి పాత్ర కూడా ఉంద‌ని సిట్ అదికారులు తెలిపారు. అయితే.. వీరిలో కొంద‌రు విదేశాల్లో ఉన్నార‌ని సిట్ పేర్కొంది.

కోర్టు అనుమ‌తిస్తే.. వారికి రెడ్ కార్న‌ర్‌నోటీసులు జారీ చేయ‌నున్న‌ట్టు అధికారులు పిటిష‌న్‌లో పేర్కొన్నారు. దీంతో సిట్ పూర్తిస్థాయిలో ఈ వ్య‌వ‌హారంపై ప‌ట్టు సాధించిన‌ట్టు అయింద‌నిన్యాయ వ‌ర్గాలు చెబుతున్నాయి. మొత్తం 43 మంది పేర్లను ఈ కేసులో పేర్కొన్న అధికారులు 12 మందిని ఇప్ప‌టికే అరెస్టుచేయ‌డం, మ‌రో 12 మంది అరెస్టు కోరుతూ పిటిష‌న్ దాఖ‌లు చేయ‌డంతో కేసు వేగంగా ముందుకు సాగుతోంద‌ని చెబుతున్నారు. అయిన‌ప్ప‌టికీ.. ఆర్థిక మూలాలు..ఇవి అంతిమంగా ఎవ‌రికి చేరాయ‌న్న విష‌యంపై మాత్రం ఇంకా కూపీలాగాల్సి ఉంద‌ని అధికారులు చెబుతుండ‌డం గ‌మ‌నార్హం. ఇప్పటికే అరెస్టు చేసిన వారితోపాటు.. కొత్త‌గా పేర్కొన్న‌వారిని కూడా అరెస్టు చేస్తే.. ఆయా వివ‌రాలు వెలుగు చూసే అవ‌కాశంఉంద‌ని అంటున్నారు.