పవన్ కొడుకును కాపాడినోళ్లు భారతీయులే.. సింగపూర్ సత్కారం

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ సింగపూర్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడ్డ సంగతి తెలిసిందే. ఈ ప్రమాదం రెండు తెలుగు రాష్ట్రాల సినీ, రాజకీయ ప్రముఖులతో పాటుగా ప్రధాని నరేంద్ర మోదీని కూడా షాక్ కు గురి చేసింది. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స తీసుకుని ఇంటికి చేరిన మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు. ఈ క్రమంలో ఈ ప్రమాదం నుంచి మార్క్ శంకర్ బయటపడిన తీరుకు సంబంధించి ఓ ఆసక్తికర ఘటన వెలుగులోకి వచ్చింది. అగ్ని ప్రమాదం నుంచి మార్క్ శంకర్ తో పాటు మిగిలిన పిల్లలందరినీ కాపాడింది పొట్ట చేతబట్టుకుని సింగపూర్ కు వెళ్లిన భారతీయ వసల కార్మికులేనట. ఈ విషయాన్ని గుర్తించిన సింగపూర్ ప్రభుత్వం ఆ భారతీయ వలస కార్మికులను ఘనంగా సత్కరించింది.

సమ్మర్ వెకేషన్ సందర్భంగా కొన్ని కోర్సులను నేర్చుకునేందుకు మార్క్ శంకర్ ను పవన్ తన సతీమణి అన్నా లెజినోవాతో సింగపూర్ పంపించారు. సింగపూర్ సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్  సమీపంలోని రివర్ వ్యాలీ రోడ్ లో ఓ మూడంతస్తుల భవంతిలో ఈ సమ్మర్ వెకేషన్ జరుగుతుండగా… ఈ నెల 8న ఉదయం ఉన్నట్లుండి అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ సమయంలో అక్కడికి సమీపంలోనే భారతీయ వలస కార్మికులు పనిచేస్తున్నారట. మూడంతస్తుల భవంతిలో నుంచి పొగలు ఎగజిమ్ముతుండటం… భవంతిలో నుంచి పిల్లల కేకలు వినిపించడంతో నలుగురు భారత వలస కార్మికులు ముందూ వెనుకా ఆలోచించకుండా రంగంలోకి దిగిపోయారు. భవంతిలోకి దూరి అక్కడ చిక్కుబడిపోయిన పిల్లలతో పాటు మరికొందరు వారు సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. 

ఈ ప్రమాదంలో మార్క్ శంకర్ తో పాటు సమ్మర్ వెకేషన్ లో ఉన్న ఓ చిన్నారి బాలిక చనిపోగా… శంకర్ సహ 15 మంది పిల్లలు, మరో ఐదుగురు సిబ్బంది గాయపడ్డారు. సమయానికి అక్కడ భారత వలస కార్మికులు లేకున్నా… ఉన్నా వారు స్పందించకపోయి ఉంటే పెద్ద ప్రమాదమే జరిగి ఉండేది. ప్రమాదం తర్వాత అక్కడికి చేరుకున్న సింగపూర్ అధికారులు అగ్ని ప్రమాదం జరిగిన తీరు, ప్రమాదంలో నుంచి పిల్లలు బయటపడిన తీరు, అందుకు సాయం చేసిన భారత వలస కార్మికుల గురించి తెలుసుకున్నారట. ఈ క్రమంలో భారత వలస కార్మికులే లేకుండా ఉంటే.. పెను నష్టం సంభవించేదని భావించిన సింగపూర్ ప్రభుత్వం… నలుగురు భారత వలస కార్మికులను ఘనంగా సత్కరించింది.