మహిళా ఎమ్మెల్యేకు సారీ చెప్పిన స్పీకర్

గెడ్డం ప్రసాద్ కుమార్… తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ మోస్ట్ నేత. ఆది నుంచి కాంగ్రెస్ ను అంటిపెట్టుకుని సాగుతున్న ఆయన… తాజాగా మంగళవారం శాసనసభాపతి హోదాను, గౌరవాన్ని మరింతగా పెంచేలా సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. సభలో ఓ సభ్యురాలి గురించి తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని ఆయన తన ఉదాత్త స్వభావాన్ని మరింతగా ఇనుమడింపజేసుకున్నారు. స్పీకర్ స్థానంలో ఉండి కూడా ఈ తరహా నిర్ణయం తీసుకున్న గెడ్డం ప్రసాద్ తీరుపై ఇప్పుడు సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.

అసలేం జరిగిందన్న విషయానికి వస్తే… సోమవారం నాటి అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ప్రధాన ప్రతిపక్షానికి చెందిన మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి సభలో ప్రసంగించారు. ఈ సందర్బంగా టైం ముగిసిపోయిందో, లేదంటే అధికార పక్షం నుంచి నిరసన వ్యక్తం అయ్యిందో తెలియదు గానీ.. ఆమె మైక్ ను గెడ్డం ప్రసాద్ కట్ చేశారు. ఈ సందర్భంగా ”బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడుతుంటే నాకే వినాలనిపిస్తలేదు. వాళ్లు ఎలా వింటున్నారో నాకు అర్థం కావడం లేదు” అని సంచలన వ్యాఖ్యలు చేశారు. స్పీకర్ స్థానంలో ఉన్ననేత చేసే వ్యాఖ్యలేనా ఇవి అన్న విమర్శలు చెలరేగాయి.

మంగళవారం సభ ప్రారంభం కాగానే… ఈ వివాదానికి చెక్ పెట్టాలనుకున్నారో, లేదంటే స్పీకర్ స్థానంలో ఉన్న తానే అలా వ్యాఖ్యానిస్తే ఎలా అనుకున్నారో తెలియదు గానీ… బేషరతుగా క్షమాపణలు చెప్పేందుకే గెడ్డం ప్రసాద్ సిద్ధ పడ్డారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ”మహిళలంటే నాకు గౌరవం. నాకు 8 మంది అక్కాచెల్లెళ్లు ఉన్నారు. మిమ్ములను ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేయలేదు. రన్నింగ్ కామెంటరీ చేస్తున్నారు. అందువల్ల నేను వినబడలేదు అని అన్నాను. సునీతా లక్ష్మారెడ్డి అంటే ఎనలేని గౌరవం ఉంది. మీ మనస్సుకు బాధ అనిపిస్తే…నా మాటలు విత్ డ్రా చేసుకుంటున్నాను” అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలతో గెడ్డం ప్రసాద్ తనతో పాటు స్పీకర్ హోదాకు కూడా మరింత గౌరవాన్ని తీసుకొచ్చారన్న వాదనలు వినిపిస్తున్నాయి.