కుదిరితే క‌లిసిరా.. లేక‌పోతే బీజేపీ భ‌జ‌న చేసుకో: ప‌వ‌న్‌కు డీఎంకే వార్నింగ్

జ‌న‌సేన అధినేత‌, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై త‌మిళ‌నాడుకు చెందిన అధికార పార్టీ డీఎంకే నాయకులు వ‌రుస పెట్టి విమ‌ర్శ‌లు గుప్పించారు. త‌మిళ‌నాడు సంప్ర‌దాయాలు, సంస్కృతి.. ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు ఏం తెలుసున‌ని వారు ప్ర‌శ్నించారు. డీఎంకే సీనియ‌ర్ నాయ‌కులు హ‌ఫీజుల్లా, ఎళ‌న్‌గోవ‌న్‌లు తాజాగా చెన్నైలో మీడియాతో మాట్లాడారు. పిఠాపురంలో నిర్వ‌హించిన జ‌న‌సేన ఆవిర్భావ స‌భ‌లో ప‌వ‌న్ క‌ల్యాణ్ చేసిన వ్యాఖ్య‌ల‌ను వారు త‌ప్పుబ‌ట్టారు.

“ప‌వ‌న్‌కు ఏం తెలుసు? ఆయ‌న మోడీ మాయ‌లో ఉన్నాడు. అందుకే నోటికి ఏది వ‌స్తే అది మాట్లాడుతు న్నాడు” అని ఎళ‌న్‌గోవ‌న్ అన్నారు. త‌మిళ‌నాడులో త్రిభాషా సూత్రం(త‌మిళం-ఇంగ్లీష్‌-హిందీ) లేద‌ని చెప్పారు. 1938 నుంచే హిందీకి వ్య‌తిరేకంగా త‌మిళ‌నాడు ఉద్య‌మాలు చేసింద‌న్న విష‌యాన్ని ప‌వ‌న్ తెలుసుకోవాల‌ని సూచించారు. 1968లో ద్విభాషా సూత్రానికి అనుకూలంగా అసెంబ్లీ తీర్మానం కూడా చేసింద‌ని చెప్పారు. ఈ రెండు విష‌యాలు తెలియ‌కుండా.. ఏదో మాట్లాడ‌డం స‌రికాద‌న్నారు.

“ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. పూర్తిగా బీజేపీ నాయ‌కుడిగా మారిపోయిన‌ట్టు ఉన్నారు. ఆయ‌న ఇష్టం. ఆయ‌న ఏ పార్టీ జెండా మోసినా అది ఏపీ ప్ర‌జ‌లు తేల్చుకుంటారు. మా విష‌యంలో వేలు పెట్టొద్ద‌ని చెబుతున్నాం. సీరియ‌స్ ప‌రిణామాలు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటే.. అప్పుడు త‌మిళ‌నాడు రాజ‌కీయాల గురించి మాట్లాడాలి” అని సయాద్ హ‌ఫీజుల్లా తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శించారు. త‌మిళ ప్ర‌జ‌ల‌ను అవ‌మానించేలా ప‌వ‌న్ వ్యాఖ్యానించార‌ని దుయ్య‌బ‌ట్టారు.

హిందీకి తాము వ్య‌క్తిగ‌తంగా వ్య‌తిరేకంగా కాద‌న్న ఆయ‌న‌.. బ‌ల‌వంతంగా ఒక భాష‌ను త‌మ ప్ర‌జ‌ల‌పై రుద్ద‌డాన్నే విమ‌ర్శిస్తున్నామ‌ని చెప్పారు. ఇప్పుడు ప‌వ‌న్ కు బీజేపీ చాలా మంచిగా ఉంటుంది.. కానీ.. ఆ పార్టీ ప్రేమ ఎలాంటిదో ముందు ముందు తెలుస్తుంది“ అని వ్యాఖ్యానించారు. త‌మిళ‌నాడు ప్ర‌జ‌ల భావాలు, ఇక్క‌డి రాజ‌కీయాలు తెలియ‌కుండా మాట్లాడితే.. ప్ర‌జ‌లే ఛీత్క‌రించుకుంటార‌ని అన్నారు. ప‌వ‌న్ వ్య‌క్తిగ‌తంగా స్టాలిన్‌ను విమ‌ర్శించ‌డం కూడా స‌రైంది కాద‌న్నారు. స్టాలిన్ చేస్తున్న‌ది జాతీయ పోరాట‌మ‌ని.. కుదిరితే.. క‌లిసి రావాల‌ని లేక‌పోతే బీజేపీకి భ‌జ‌న చేసుకోవాల‌ని వ్యాఖ్యానించారు.