ఒక మూణ్నాలుగేళ్ల పాటు టాలీవుడ్లో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ మార్మోగిపోయింది. తెలుగు ఫిలిం హిస్టరీలోనే మరే సంస్థకూ సాధ్యం కాని రీతిలో ఒక సంస్థలో ఒకే సమయంలో 25 సినిమాలు వివిధ దశల్లో ఉండడం అన్నది పీపుల్ మీడియా బేనర్లోనే జరిగింది. కానీ కేవలం రాశి ఉంటే సరిపోదని వాసి కూడా ఉంటేనే ఏం సంస్థ అయినా బలంగా నిలబడగలదని రుజువైంది. పీపుల్ మీడియా బేనర్లో తెరకెక్కిన చిత్రాల్లో చాలా వరకు ఫ్లాప్ కావడంతో ఆ సంస్థ జోరు తగ్గిపోయింది. ఈ బేనర్ పూర్తి చేసిన కొన్ని చిత్రాలు విడుదలకే నోచుకోకుండా ఆగిపోయాయి.
రాజాసాబ్ సినిమాతో అన్ని లెక్కలూ సరి చేసి బేనర్ను ముందుకు తీసుకెళ్లాలని ఆ సంస్థ అధినేత విశ్వప్రసాద్ భావించారు. కానీ ఆ సినిమా ఇంకా పెద్ద డిజాస్టర్ అయి… ముందు సినిమాలన్నీ కలిపి తెచ్చిన నష్టాలను మించి లాస్ మిగల్చడంతో విశ్వ ప్రసాద్ బాగా డల్ అయిపోయారు. పీపుల్ మీడియా సంస్థ వార్తల్లో లేకుండా పోయింది. ఆ సంస్థ సినిమాల గురించి అప్డేట్స్ కూడా పెద్దగా లేవు.
ఇలాంటి టైంలో విశ్వప్రసాద్.. మళ్లీ రెబల్ స్టార్ ప్రభాస్తో అసోసియేట్ కావడం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ప్రభాస్ కొత్త చిత్రం స్పిరిట్ కర్ణాటక హక్కులను పీపుల్ మీడియా సంస్థ సొంతం చేసుకుంది. ఇందులో ఏషియన్ సునీల్, సురేష్ బాబు కూడా భాగస్వాములు కావడం విశేషం. మూడు పెద్ద సంస్థలు కలిసి స్పిరిట్ కర్ణాటక రైట్స్ తీసుకున్నాయి. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ చిత్రాల తర్వాత ప్రభాస్ లాంటి టాప్ స్టార్ను పెట్టి సందీప్ రెడ్డి వంగ తీస్తున్న స్పిరిట్ మీద అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
రాజాసాబ్ సినిమాతో విశ్వప్రసాద్ గట్టి దెబ్బ తిన్న నేపథ్యంలో ప్రభాస్ ఆయనకు సాయం తోడ్పాటు అందించడం కోసం స్పిరిట్ రైట్స్ రీజనబుల్ రేటుకు ఇప్పించినట్లు ఇండస్ట్రీలో చర్చించుకుంటున్నారు. రేటు ఎంత పెట్టినా సరే.. ఈ సినిమా భారీ లాభాలు అందించగలదని ప్రభాస్ నమ్ముతున్నాడు. అందుకే ఈ డీల్లో విశ్వప్రసాద్ను భాగస్వామిని చేసినట్లు తెలుస్తోంది. నిజానికి రాజాసాబ్ నష్టాల భర్తీ కోసం ప్రభాస్ విశ్వప్రసాద్కు మరో సినిమా చేస్తాడని వార్తలు వచ్చాయి. కానీ కొన్నేళ్ల పాటు ఖాళీ లేని నేపథ్యంలో ప్రస్తుతానికి స్పిరిట్ కర్ణాటకహక్కులు దక్కేలా చూశాడని అంటున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates
