లోక్ సభలో లిక్కర్ గోల.. ఏపీ ఎంపీల సిగపట్లు

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఏపీకి సంబంధించిన సమస్యలు వరుసగా ప్రస్తావనకు వస్తున్నాయి. అందులో భాగంగా మంగళవారం నాటి లోక్ సభ సమావేశాల్లో బీజేపీ ఎంపీ సీఎం రమేష్, వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డిల మధ్య మాటల యుద్ధం నెలకొంది. వైసీపీ పాలనపై రమేష్ విసుర్లు సాధిస్తే… రమేష్ వ్యాఖ్యలను ఖండించే క్రమంలో మిథున్ రెడ్డి వ్యక్తిగత విమర్శలు చేసి సంచలనం రేపారు.

లోక్ సభ జీరో అవర్ లో భాగంగా మైక్ లభించిన సీఎం రమేష్.. ఏపీలో కూడా ఢిల్లీ తరహాలో లిక్కర్ స్కాం జరిగిందని ఆరోపించారు. ఢిల్లీలో రూ.2,500 కోట్ల మేర స్కాం జరిగితే… ఏపీలో దానికి 10 రేట్ల మేర లిక్కర్ స్కాం జరిగిందని ఆరోపించారు. అంతేకాకుండా లిక్కర్ వ్యాపారాన్ని ప్రైవేట్ చేతిలో నుంచి ప్రభుత్వ పరిధిలోకి తీసుకువచ్చారని ఆయన ఆరోపించారు. లక్ష కోట్ల మేర వ్యాపారం జరిగితే.. సింగల్ పైసా కూడా డిజిటల్ గా బదిలీ కాలేదన్నారు. ఉద్యోగుల్లో అందరినీ కాంట్రాక్టు పద్దతిలోనే నియమించుకున్నారని ఆరోపించారు.

ఈ సందర్బంగా రమేష్ ప్రసంగానికి అడ్డు తగిలిన మిథున్ రెడ్డి… బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు అర్థరహితమని అన్నారు. అసలు రమేష్ బీజేపీ ఎంపీనా, టీడీపీ ఎంపీనా అని మిథున్ ప్రశ్నించారు. చంద్రబాబు నుంచి కాంట్రాక్టులు దక్కించుకునేందుకు రమేష్ ఇలాంటి అర్థరహిత ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే… మిథున్ నోట చంద్రబాబు పేరు విన్నంతనే… డిప్యూటీ స్పీకర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. సభలో లేని నేతల గురించిన ప్రస్తావన సరి కాదని ఆయన మిథున్ కు గుర్తు చేశారు. మొత్తంగా ఉన్నట్టుండి… లోక్ సభలో ఏపీ లిక్కర్ స్కాం అంటూ రమేష్ చేసిన ఆరోపణలు కలకలం రేపాయి.