రాజు గారు భలే బేరాలు పడుతున్నారు

టాలీవుడ్లో ఇప్పుడు ఏ రకంగా చూసినా నంబర్ వన్ ప్రొడ్యూసర్ అంటే దిల్ రాజే. సినిమాల ఫ్రీక్వెన్సీ, వాటి రేంజ్, సక్సెస్ రేట్.. ఇలా అన్ని పారామీటర్లు తీసుకుంటే రాజు మిగతా అందరినీ వెనక్కి నెట్టేసి అగ్ర స్థానంలో ఉంటారు.

అప్పుడప్పుడూ అందరి లాగే ఆయన కూడా కొన్ని ఎదురు దెబ్బలు తింటుంటారు కానీ.. చాలా వరకు ఆయన పైచేయి సాధిస్తుంటారు. కొన్ని నెలలుగా థియేటర్లు మూతపడి ఉన్న నేపథ్యంలో వేరే భాషల్లో పేరున్న సినిమాలు ఓటీటీల్లో రిలీజవుతుంటే.. తెలుగు నిర్మాతలు మాత్రం ఆ విషయంలో విముఖంగా ఉండగా.. రాజే చొరవ తీసుకుని కాలానికి తగ్గట్లు మారాలన్న ఉద్దేశంతో తన నిర్మాణంలో తెరకెక్కిక క్రేజీ మూవీ ‘వి’ని అమేజాన్ ప్రైమ్ వాళ్లకు అమ్మేశాడు. సినిమా బడ్జెట్ మీద కాస్త లాభానికి డిజిటల్ రైట్స్ అమ్ముడైనట్లు తెలుస్తోంది.

ఇంకా శాటిలైట్, డబ్బింగ్ హక్కులు ఉన్నాయి. తర్వాత కుదిరితే థియేటర్లలోనూ ఈ చిత్రాన్ని థియేటర్లోనూ రిలీజ్ చేసి కొంత ఆదాయం రాబట్టాలన్న ఆలోచన కూడా రాజుకు ఉంది. ఇదిలా ఉండగా.. ‘వి’ డీల్ సెట్ అయిందో లేదో.. తన ప్రొడక్షన్లో తెరకెక్కుతున్న మరో సినిమా డిజిటల్ బేరం కూడా రాజు తెంచేసినట్లు సమాచారం.

వేరే నిర్మాతలు మొదలుపెట్టి.. తర్వాత రాజు చేతిలోకి వచ్చిన ‘గుడ్ లక్ సఖి’ని కూడా ఓటీటీలోనే నేరుగా రిలీజ్ చేయాలని నిర్ణయించారు. దీన్ని కూడా అమేజాన్ ప్రైమ్ వాళ్లకే అమ్మేశారట. ఈ సినిమా బడ్జెట్ మీద మంచి లాభానికి డీల్ కుదిరిందట. ఆ మొత్తం రూ.13 కోట్లని సమాచారం. నగేష్ కుకునూర్ దర్శకత్వంలో కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా ఇది. ఆమె నటించిన ‘పెంగ్విన్’ కూడా ప్రైమ్‌లోనే రిలీజైంది.

దాని మీద రెట్టింపు స్థాయిలో ఈ డీల్ జరిగినట్లు తెలుస్తోంది. ఈ చిత్రం కూడా సెప్టెంబర్లోనే ప్రైమ్‌లో రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. రాజు బాటలో మరిందరు నిర్మాతలు ప్రైమ్, ఇతర ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌తో చర్చలు జరుపుతూ విడుదలకు సిద్ధంగా ఉన్న తమ చిత్రాల్ని ఆన్‌లైన్లో రిలీజ్ చేసేయడానికి రెడీ అవుతున్నారు.