సోషల్ మీడియా జమానాలో లీకులు పెద్ద తలనెప్పిగా మారాయి. కీలకమైన ట్విస్టులు ముందే చెప్పేయడం ఒకరకమైన సమస్య అయితే, షూటింగ్ జరుగుతున్నప్పుడు ఎవడో కనిపించకుండా దూరం నుంచి షూట్ చేసిన వీడియోలు బయటికి రావడం ప్యాన్ ఇండియా సినిమాలకు నరకంగా మారాయి. వారణాసి మొదలైన కొత్తలో మహేష్ బాబు, పృథ్విరాజ్ సుకుమారన్ మధ్య నడిచే చిన్న క్లిప్ ఎంత దుమారం రేపిందో తెలిసిందే. డిలీట్ చేయించే లోపు లక్షలాది మంది చూసేశారు.
తాజాగా మరో కొత్త సన్నివేశం వారణాసికి ఇబ్బందికరంగా మారింది. కేవలం కొన్ని సెకండ్లే ఉన్న కాశి ఎపిసోడ్ కు సంబంధించిన సీన్ ఆన్ లైన్లో చక్కర్లు కొట్టింది. అలెర్ట్ అయిన జక్కన్న బృందం ఆఘమేఘాల మీద సదరు అకౌంట్ల మీద చర్యలు తీసుకుంది. అప్పటికే పలు సామజిక మాధ్యమాల ద్వారా అది దూరం వెళ్ళిపోయింది. అసలిది ఎలా జరిగిందనే కోణంలో రాజమౌళి చాలా సీరియస్ గా ఉన్నారట. ఎవరు తీశారనే దాని మీద పోలీసుల సహాయం తీసుకోవచ్చేమో.
ఇంకో మూడు రోజుల్లో మహేష్ బాబు పుట్టినరోజు రానుంది. ఈ సందర్భంగా వారణాసి నుంచి ఎలాంటి అప్డేట్ వస్తుందోనని అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. టీజర్ లాంటిది ఉండదని, రెండు కొత్త పోస్టర్లతో సర్దుకోవాల్సి ఉంటుందని ముందస్తు సమాచారం ఉండటంతో దానికి అనుగుణంగానే ప్రిపేర్ అయ్యారు. ఈలోగా ఈ లీకు పంచాయితీ అడ్డం వచ్చింది. లీగల్ గా చర్యలు కఠినంగా ఉంటే తప్ప వీటికి అడ్డుకట్ట వేయడం అసాధ్యం అనిపిస్తోంది.
రాజమౌళికి ఈ ప్రాబ్లమ్ ఇప్పటిది కాదు. బాహుబలి, ఆర్ఆర్ఆర్ టైంలో కూడా ఇవి వేధించాయి. టెక్నాలజీ పెరిగే కొద్దీ ఈ లీకులు కొత్త రూపం దాలుస్తున్నాయి తప్పించి ఆగడం లేదు. అక్కడికి తన షూటింగ్ స్పాట్లో వీలైనంత వరకు సెల్ ఫోన్లు అనుమతించకుండా కేవలం శాటిలైట్ ఫోన్లు మాత్రమే వాడే జక్కన్నకు కనిపించని ముప్పులు ఎక్కడో దూరంలో పొంచి ఉంటాయి. షూట్ దాదాపు 80 శాతం పూర్తయిపోయింది కాబట్టి ఇకపై మరింత జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం.
Gulte Telugu Telugu Political and Movie News Updates