రాకాసి గాడ్జిల్లాని రామాయణ తొక్కగలదా

భారతదేశపు అత్యంత ఖరీదైన సినిమాగా చెప్పుకుంటున్న రామాయణ నవంబర్ 6 విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఇంగ్లీష్ ట్రైలర్ తో బాటుగా ఈ డేట్ ని నిర్మాతలు అధికారికంగా రివీల్ చేశారు. రన్బీర్ కపూర్, సాయిపల్లవి, యష్, రకుల్ ప్రీత్ సింగ్, సన్నీ డియోల్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ ఎపిక్ డ్రామా మొదటి భాగం మీద ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. ట్రైలర్ మీద భిన్నాభిప్రాయాలు ఎన్ని ఉన్నా కంటెంట్ పట్ల దర్శక నిర్మాతలు చాలా నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.

అయితే రిలీజ్ డేట్ పట్ల రన్బీర్ ఫ్యాన్స్ అంత సంతోషంగా లేరు. ఎందుకంటే అదే రోజు గాడ్జిల్లా మైనస్ జీరో ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున విడుదలవుతోంది. అత్యున్నత సాంకేతిక నైపుణ్యంతో పూర్తి ఐమాక్స్ టెక్నాలజీతో తీసిన భారీ బడ్జెట్ మూవీ ఇది . మూడేళ్ళ క్రితం జపాన్ లో నిర్మితమై ఇతర భాషల్లో కూడా సంచలన విజయం సాధించిన గాడ్జిల్లా మైనస్ వన్ కి ఇది కొనసాగింపు. సెప్టెంబర్ 26 న్యూ యార్క్ ఫిలిం ఫెస్టివల్ లో దీన్ని ప్రత్యేకంగా ఆహ్వానితులకు మాత్రమే ప్రీమియర్ చేయబోతున్నారు.

వరల్డ్ వైడ్ థియేటర్ అగ్రిమెంట్లు ఆల్రెడీ గాడ్జిల్లా మైనస్ జీరోకు జరిగిపోతున్నాయని హాలీవుడ్ రిపోర్ట్. ముఖ్యంగా ఐమాక్స్ స్క్రీన్లను పెద్ద ఎత్తున లాక్ చేస్తున్నారట. అలాంటప్పుడు రామాయణ మరింత జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇంటర్నేషనల్ రిలీజ్ సోనీ ఎంటర్ టైన్మెంట్స్ తీసుకుంది కాబట్టి థియేటర్ పంపకాల విషయంలో నిర్మాత నమిత్ మల్హోత్రా టెన్షన్ పడటం లేదని ముంబై టాక్. అవసరమైన తెరలను ఆ సంస్థ ద్వారా సెట్ చేసుకోవచ్చని ధీమాగా ఉన్నారట.

ఇండియాతో పాటు అన్ని దేశాల్లో ఒకేసారి రామాయణ రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. జానర్ పరంగా చూసుకుంటే గాడ్జిల్లా, రామాయణం రెండూ ఒకదానితో మరొకటి సంబంధం లేనివి. కాకపోతే ఓవర్సీస్ లో థియేటర్ షేరింగ్ విషయంలో సమస్యలు వచ్చే అవకాశం లేకపోలేదు. పార్ట్ 1 విజయం సాధిస్తేనే 2028లో విడుదలయ్య సీక్వెల్ కు క్రేజ్ వస్తుంది. అందుకే ఓపెనింగ్స్ నుంచి మౌత్ టాక్ దాకా రామాయణ యునానిమస్ అనిపించుకుంటేనే వర్కౌట్ అవుతుంది.