అంత భారీ నౌకను ఎలా హైజాక్ చేశారు?

భారత్ కు వస్తున్న భారీ వాణిజ్య నౌకను హైజాక్ చేసిన వైనం తెలిసిందే. తుర్కియే నుంచి వస్తున్న గెలాక్సీ లీడర్ కార్గోషిప్ ఇజ్రాయెల్ కు చెందిన సంపన్నుడిది. అయితే.. ఆ నౌక నిర్వహణ మొత్తం ఇజ్రాయెల్ ప్రభుత్వానికి సంబంధం లేనప్పటికీ హౌతీ రెబల్స్ హైజాక్ చేయటం.. దాన్ని యెమెన్ తీర ప్రాంతానికి తరలించిన వైనం తెలిసిందే. ఇంతకూ నడి సముద్రంలో అంత పెద్ద నౌకను ఎలా హైజాక్ చేసి ఉంటారు? అలా సాధ్యమేనా? అన్న సందేహాలకు తెర దించుతూ.. తాజాగా ఒక వీడియోను విడుదల చేశారు.

అందులో కార్గో షిప్ ను ఎలా హైజాక్ చేశారన్న విషయాన్ని వివరంగా చెప్పారు. మొత్తం రెండు నిమిషాలకు పైనే ఉన్న ఈ వీడియోలో నౌకను హైజాక్ చేయటానికి ముందు కొందరు గెరిల్లా కమాండోలు హెలికాఫ్టర్ లో వెళ్లటం.. హెలికాఫ్టర్ నౌక మీద ల్యాండ్ అయిన తర్వాత.. అందులో నుంచి సాయుధులైన సైనికులు కిందకు దిగటం.. ఆ వెంటనే హెలికాఫ్టర్ వెళ్లిపోవటం తెలిసిందే.

హెలికాఫ్టర్ లోకి వచ్చిన సాయుధులు ఓడ డెక్ పైన దిగి.. అల్లాహో అక్బర్.. అంటూ గాజాకు తమ మద్దతును ప్రకటిస్తూ.. అదే విషయాన్ని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ గాలిలో కాల్పులు జరుపుతూ అక్కడున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. నౌకలోని ప్రతి విభాగాన్ని చెక్ చేసి.. మొత్తంగా తమ అధీనంలోకి తీసుకున్నారు. హమాస్ – ఇజ్రాయెల్ మధ్య నడుస్తున్న యుద్ధం నేపథ్యంలో ఇజ్రాయెల్ నౌకల్ని లక్ష్యంగా చేసుకుంటామన్న హౌతీ తిరుగుబాటుదారులు అందుకు తగ్గట్లే నౌకను హైజాక్ చేశారు.

అయితే.. ఈ నౌకలో తమ దేశానికి చెందిన పౌరులు ఎవరూ లేరని ఇజ్రాయెల్ వెల్లడించటం తెలిసిందే. గెలాక్సీ లీడర్ ఇజ్రాయెల్ కు చెందిన సంపన్న వ్యాపారుడిదే అయినప్పటికీ అందులోని సరకు కానీ సిబ్బంది కానీ ఇజ్రాయెల్ కు చెందిన వారు లేకపోవటం గమనార్హం. ప్రస్తుతం సదరు నౌకను జపాన్ కు చెందిన ఒక సంస్థ నిర్వహిస్తుంటే.. నౌకలోని సిబ్బంది మొత్తం బల్గేరియా.. ఫిలిప్పీన్స్.. మెక్సికో.. ఉక్రెయిన్ కు చెందిన వారు కావటం తెలిసిందే. నెట్టింట విడుదల చేసిన ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.