ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిపై మరో మహిళా ట్రైనీ ఐపీఎస్ లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాలలో దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఉదయ్ పై కేసు నమోదు కాగా…ఆ తర్వాత ఆయన నాటకీయ పరిణామాల మధ్య ఆత్మహత్యాయత్నం చేయడం సంచలనం రేపింది. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత ఉదయ్ తన ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి అందుబాటులో లేకుండా పోయారు. దీంతో, రెండ్రోజులుగా పోలీసులు ఉదయ్ కోసం గాలిస్తున్నారు.
అయితే, తానెక్కడికీ పారిపోలేదని, తన నాయనమ్మ ఆరోగ్యం బాగోలేకపోతే పలకరించేందుకు తమ స్వగ్రామం ఊళ్లపాలెం వెళ్లానని చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఉదయ్ ను మిర్యాలగూడ పోలీసులు అరెస్ట్ చేసి అత్తాపూర్ పోలీస్ స్టేషన్ కు తరలించబోతున్నారు.
హైదరాబాద్ కు తరలించిన తర్వాత బాధితురాలి స్టేట్మెంట్ రికార్డ్ చేయబోతున్నారు. ఆ తర్వాత మరిన్ని సెక్షన్ల కింద ఉదయ్ పై ఎఫ్ ఐఆర్ నమోదు చేసే అవకాశముందని తెలుస్తోంది. తనను లైంగికంగా వేధించడంతో పాటు బ్లాక్ మెయిల్ చేశారని బాధితురాలు సంచలన ఆరోపణలు చేశారు.
అయితే, ఆ ఆరోపణలు అవాస్తవమని ఉదయ్ కొట్టిపారేశారు. కానీ, ప్రాథమిక విచారణ అనంతరం ఉదయ్ పై ఈ నెల 18న పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత అనేక నాటకీయ పరిణామాల మధ్య ఎట్టకేలకు ఉదయ్ ను ఈ రోజు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యవహారంపై ఉదయ్ కోర్టును ఆశ్రయించగా అక్కడ ఆయనకు చుక్కెదురైన సంగతి తెలిసిందే.
Gulte Telugu Telugu Political and Movie News Updates
