చెల్లెలి ప్రియుడిని చంపేసి.. కుక్క‌ల‌కు ఆహారం..

దేశంలో ఘోరాలు.. ఘోరంగా జ‌రుగుతున్నాయి. మనుషుల‌ను చంపేయ‌డం.. ఏ చీమ‌నో.. దోమ‌నో చంపేసినంత తేలిక‌గా మారిపోయింది. అంతేకాదు.. ఆ చంపిన వారు.. అక్క‌డితో కూడా ఆగ‌డం లేదు. స‌ద‌రు మృత దేహాల‌ను ముక్క‌లు ముక్క‌లుగా న‌రికి.. ఇష్టానుసారం విసిరేస్తున్నారు. ఇటీవ‌ల ఢిల్లీలో శ్ర‌ద్ధా వాక‌ర్ ఘ‌ట‌న‌లో ఆమె ప్రియుడు ఆమెను 35 ముక్క‌లు చేసి.. అడ‌విలో విస‌రేసిన ఘ‌ట‌న ఉలిక్కి ప‌డేలా చేసింది.

అయితే.. తాజాగా బిహార్‌లో చోటు చేసుకున్న ఘ‌ట‌న దీనికి బాబు అనిపించే రేంజ్‌లో సాగింది. త‌న చెల్లెలిని ప్రేమించిన ఓయుకుడిని.. స‌ద‌రు అన్న చంపేశాడు. అక్క‌డితో ఆగ‌లేదు. ఆ ప్రియుడి మృతదేహాన్ని ముక్కలుగా నరికి.. కుక్కలకు ఆహారంగా వేశాడు. ఆ కుక్క‌లు తిన‌గా మిగిలిన శ‌రీర భాగాల‌ను నదిలో విసిరేసి.. వికృతానందం పొందాడు.

అత్యంత పాశ‌వికం.. అమానుష‌మైన ఈ ఘ‌ట‌న దేశాన్ని కదిలించివేసింది. బిహార్లోని నలంద బిట్టు కుమార్.. ఈ నెల 16వ తేదీన బయటకు వెళ్లి తిరిగి ఇంటికి చేరుకోలేదు. దీంతో అతడి కోసం కుటుంబ సభ్యులు వెతకగా ఆచూకీ లభించలేదు. ఈ క్ర‌మంలో డిసెంబరు 18న పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విచారణలో భాగంగా నిందితుడు రాహుల్పై అనుమానం వచ్చి అదుపులోకి తీసుకున్నారు.

అతడి దగ్గర ఉన్న బాధితుడి మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. తమదైన శైలిలో పోలీసులు విచారణ జరపగా.. రాహుల్ నేరాన్ని ఒప్పుకున్నాడు. తన సోదరితో బిట్టు సన్నిహితంగా ఉండడం చూశానని అది తట్టుకోలేకపోయానని రాహుల్ పోలీసులకు తెలిపాడు. కోపంతో బిట్టును చంపేందుకు ప్లాన్ చేశానని చెప్పాడు.

డిసెంబరు 16న తన సోదరి మొబైల్ నుంచి ఫోన్ చేసి బిట్టును నిర్మానుష్య ప్రదేశానికి పిలిచానని, అనంతరం అతడిని చంపానని తెలిపాడు. మృతదేహాన్ని ముక్కలుగా నరికి కుక్కలకు ఆహారంగా పెట్టానని.. అవి వ‌దిలేసిన మిగతా శ‌రీర భాగాల‌ను నదిలోకి విసిరేశానని ఒప్పుకున్నాడు. ఈ ఘ‌ట‌న మ‌న‌సున్న ప్ర‌తి ఒక్క‌రినీ క‌ల‌చి వేసింది. ఇంత‌కీ ఎందుకు ఇంత ఘోరం చేశాడంటే.. త‌న చెల్లిని ప్రేమించిన బిట్టు ద‌ళితుడు కావ‌డ‌మే!!