విద్యార్థిని ఆత్మ‌హ‌త్య‌.. చంద్ర‌బాబు తీవ్ర ఆవేద‌న.. ఏంటీ బంధం?

పోలవరం జిల్లా ఈర్లపల్లి గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్ధిని ముర్రం శివాని ఆత్మ‌హ‌త్య చేసుకుంది. దీనికి సంబంధించిన కార‌ణాలు తెలియాల్సి ఉంది. అయితే.. తీవ్ర‌మైన క‌డుపు నొప్పిని భ‌రించ‌లేకే ఆమె ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డి ఉంటుంద‌ని కుటుంబ స‌భ్యులు చెబుతున్నారు. సోమ‌వారం మ‌ధ్యాహ్నం జ‌రిగిన ఈ ఘ‌ట‌న‌పై సీఎం చంద్ర‌బాబు తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. చాలా చ‌క్క‌టి పిల్ల ఇలా ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డం.. త‌న‌ను ఆవేద‌న‌కు గురి చేసింద‌ని ఆయ‌న పేర్కొన్నారు. ఎంతో భ‌విష్య‌త్తు ఉంద‌ని.. తాను భావించాన‌ని అలాంటిది అక‌స్మాత్తుగా ఇలాంటివార్త వినాల్సి రావ‌డం చాలా క‌ష్టంగా ఉంద‌న్నారు.

ఏంటీ బంధం?

శివానీ మృతి ప‌ట్ల‌.. చంద్ర‌బాబుకు ఇంత ఆవేద‌న క‌ల‌గ‌డానికి కార‌ణం.. ఆమెతో ఏర్ప‌డిన చిరు అనుబంధ‌మే!. రెండు రోజుల కింద‌ట రాష్ట్ర వ్యాప్తంగా నిర్వ‌హించిన మెగా పేరెంట్‌, టీచ‌ర్స్ మీటింగ్ స‌మ‌యంలో చంద్ర‌బాబుతో ఆ బాలిక క‌లివిడిగా వ్య‌వ‌హ‌రించింది. పోల‌వ‌రం జిల్లా రంప‌చోడ‌వ‌రం బాలికోన్న‌త పాఠ‌శాల‌లో నిర్వ‌హించిన మెగాపేరెంట్స్‌, టీచ‌ర్స్ మీట్‌కు సీఎం చంద్ర‌బాబు, మంత్రి నారా లోకేష్‌లు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా సీఎం చంద్ర‌బాబు ప‌క్క‌నే కూర్చున్న శివానీ.. ఆయ‌న‌కు పాఠ‌శాల గురించిన అనేక విష‌యాలను వివ‌రించింది. అదేవిధంగా ప్ర‌స్తుతం ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన విద్యా సంస్క‌ర‌ణ‌ల‌పైనా ఆమె చెప్పిన విష‌యాల‌ను చంద్ర‌బాబు అప్పుడే మెచ్చుకున్నారు.

అంతేకాదు, మ‌ధ్యాహ్న భోజ‌నం కూడా అక్క‌డే చేసిన సీఎం చంద్ర‌బాబు ప‌క్కనే ఆమె కూడా కూర్చుంది. ఇలా.. కేవ‌లం ఓ గంట సేపు ఇరువురు క‌లివిడిగా క‌నిపించారు. ఈ అనుబంధాన్నే సీఎం చంద్ర‌బాబు గుర్తు చేసుకున్నారు. రంపచోడవరంలో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో వేదికపై ఎంతో ఉత్సాహంగా మాట్లాడిన శివాని బలవన్మరణం ఆవేదన కలిగించిందని తెలిపారు.  తన చదువు, ఉన్నత లక్ష్యాల గురించి శివాని చెప్పిన మాటలు ఇంకా త‌న‌కు వినిపిస్తున్న‌ట్టే ఉన్నాయ‌ని పేర్కొన్నారు. శివానీకి ఎంతో భవిష్యత్ ఉంద‌న్నారు.

ముఖ్యంగా గిరిజన కుటుంబం నుంచి వ‌చ్చి చ‌దువులో రాణిస్తున్న శివానీ ఆక‌స్మికంగా బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ‌డం త‌న‌ను తీవ్రంగా క‌ల‌చి వేసింద‌ని చంద్ర‌బాబు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇక‌, మంత్రి నారా లోకేష్ కూడా ఇలానే స్పందించారు. త‌న సోద‌రి శివానీ ఆక‌స్మిక మ‌ర‌ణం తీవ్రంగా ఆవేద‌న‌కు గురి చేసింద‌న్నారు. చ‌దువుల త‌ల్లికి ఏం ఇబ్బంది క‌లిగిందో.. అని లోకేష్ పేర్కొన్నారు. ఇదిలావుంటే, శివాని మృతిపై పూర్తి దర్యాప్తు జరపాలని అధికారులను  సీఎం చంద్ర‌బాబు ఆదేశించించారు. నేటి యువ‌త‌, విద్యార్థుల‌కు ఎలాంటి సమస్యలు, కష్టాలు వచ్చినా ధైర్యంగా నిలబడాలని.. ఆత్మ‌హ‌త్య‌లు ప‌రిష్కారం కాద‌ని ఆయ‌న పేర్కొన్నారు.