పెళ్లైన 5 నెలలకే విశాఖ పోలీస్ స్టేషన్ ఎదుట సూసైడ్!

లైఫ్ ను ప్రభావితం నిర్ణయాలు తీసుకునే వేళలో అత్యంత అప్రమత్తంగా ఉండాలి. అందులో ఏ మాత్రం ఏమరుపాటుతో వ్యవహరించినా విషాదమే. అలాంటి ఉదంతమే ఒకటి విశాఖలో చోటు చేసుకుంది. విశాఖపట్నంలో లా కాలేజీలో చదువుతున్న లా స్టూడెంట్ ఒకరు పోలీస్ స్టేషన్ ఎదుట ఆత్మహత్య చేసుకున్న శ్రావణి వైనం సంచలనంగా మారింది. ఆమె విషాద ఉదంతం గురించి తెలిసిన వారంతా అయ్యో పాపం అనేసే పరిస్థితి.

గుంటూరుకు చెందిన 22 ఏళ్ల శ్రావణి విశాఖపట్నంలోని ఒక ప్రైవేటు కాలేజీలో లా చదువుతోంది. అదే కాలేజీలో సీనియర్ అయిన వినయ్ కుమార్ తో పరిచయమైంది. అది కాస్తా ప్రేమగా మారింది. అతనికి అప్పటికే పెళ్లై.. విడాకులు తీసుకున్నాడు. ఇదిలా ఉంటే.. ఇంట్లో వాళ్లకు తెలీకుండా ఐదు నెలల క్రితం శ్రావణి అతడ్ని రహస్యంగా పెళ్లాడింది. ఒకవైపు లా కోర్సు చేస్తూనే మరోవైపు పార్ట్ టైమ్ జాబ్ చేస్తోంది. ఇక.. వినయ్ కుమార్ రెస్టారెంట్ లో పని చేస్తున్నాడు.

పెళ్లై.. ఐదు నెలల గడిచాయో లేదో వారి మధ్య విభేదాలు మొదలయ్యాయి. ఇదిలా ఉంటే.. మూడు రోజుల క్రితం ఎంవీపీ పోలీస్ స్టేషన్ లో భర్త వినయ్ గురించి శ్రావణి కంప్లైంట్ చేసింది. దీంతో.. వారిద్దరినీ పిలిచిన పోలీసులు.. స్టేషన్ మొదటి అంతస్తులో కౌన్సెలింగ్ నిర్వహించారు. మధ్యలో బయటకు వచ్చిన ఆమె.. స్టేషన్ కిందకు వచ్చి.. ‘నేను తప్పు చేశా’ అంటూ పెద్దగా రోదిస్తూ.. తనతో పాటు తెచ్చుకున్న పెట్రోల్ ను ఒంటి మీద పోసుకుంది.

ఈ ఉదంతాన్ని గమనించిన పోలీసులు.. ఎస్ఐ శ్రీనివాస్ కు తెలియజేశారు. దీంతో.. ఆయన పరుగు పరుగున కిందకు వచ్చారు. అప్పటికే అగ్గిపుల్ల వెలిగిస్తున్న ఆమెనుఅడ్డుకునే ప్రయత్నం చేయగా.. అప్పటికే మంటలు అంటుకొన్నాయి. ఆర్పే ప్రయత్నంలో ఎస్ఐ చేతులకు గాయాలయ్యాయి. ఆమెను ఆసుపత్రికి తరలించగా.. కాసేపటికే మరణించింది. ప్రేమించిన వాడిని రహస్యంగా పెళ్లాడి.. విభేదాలతో అర్థాంతంగా ప్రాణాల్ని తీసుకున్న వైనం ఇప్పుడు షాకింగ్ గా మారింది.