ఏపీలో `చింతామ‌ణి`పై నిషేధం.. రీజ‌నేంటి?

చింతామ‌ణి- ఈ పేరు విన‌గానే నాట‌క ప్రియులు ప‌రుగులు పెట్టుకుంటూ వెళ్లిపోతారు. ప‌నులు మానుకునైనా.. చింతామ‌ణి నాట‌కం ప్ర‌ద‌ర్శించే చోట‌కు వెళ్లి.. క‌న్నులార చూసి.. క‌డుపారా న‌వ్వుకుని వ‌స్తారు. అంతేకాదు.. గ‌తంలో టీవీలు లేని రోజుల్లో ఆధ్యాత్మికంగా చూసుకున్న‌ప్పుడు హ‌రిశ్చంద్ర నాట‌కం ఎంత పాపుల‌రో.. సామాజికంగా చూసుకుంటే.. చింతామ‌ణి.. దానికి మించిన పాపుల‌ర్ అన‌డంలో సందేహం లేదు. దీనికి కార‌ణం.. ఈ నాట‌కంలో ఉన్న పాత్ర‌లు.. ఈ పాత్ర‌ల మ‌ధ్య ఉన్న నాట‌కీయ‌త‌.. అంత‌కు మించిన `డ‌బుల్ మీనింగ్ డైలాగులు`… వంటివి చింతామ‌ణిని మోత‌మోగించాయి. ముఖ్యంగా యువ‌త, మ‌ధ్య వ‌య‌స్కులు పెద్ద ఎత్తున ఈ నాట‌కానికి పోటెత్తేవారు.

అయితే.. ప్ర‌స్తుతం ఈ నాట‌కాన్ని ఏపీలోని వైసీపీ ప్ర‌భుత్వం నిషేధించింది. ఈ మేర‌కు సోమ‌వారం రాత్రి పొద్దు పోయాక జీవో జారీ చేసింది. దీంతో కొన్ని ద‌శాబ్దాల పాటు.. పురుష పుంగ‌వుల‌ను మురిపించి, మెరిపించి.. మురిపాలు మూట‌గ‌ట్టిన చింతామ‌ణి ప్ర‌ద‌ర్శ‌న‌లు నిలిచిపోనున్నాయి. చింతా మ‌ణి నాటకాన్ని ప్ర‌ముఖ క‌వి బ‌లిజేప‌ల్లి ల‌క్ష్మీకాంతం రాశారు. దాపు 80 ఏళ్ల కింద‌టి నాట‌కంగా ఇది గుర్తింపు పొందింది. దీనిలో ప్ర‌ధాన పాత్ర ధారి సుబ్బిశెట్టి. ఈయ‌న వైశ్య సామాజిక వ‌ర్గానికి చెందిన వ్యాపారి. వేశ్య‌ల‌పై ఈయ‌న‌కు మంచి మోజు.. దీంతో ఎక్కువ‌గా వారి వ‌ద్దే ఉండేవాడు. ఈ నాటకంలో బ‌లిజేప‌ల్లి ల‌క్ష్మీకాంతం ఎక్కువ‌గా డబుల్ మీనింగ్ డైలాగులు రాశారు. ముఖ్యంగా ప్రైవేట్ పార్ట్స్‌పైనే ఎక్కువ‌గా డైలాగులు ఉన్నాయి. దీంతో పురుష పుంగ‌వులు అప్ప‌ట్లోనే ప‌నులు మానుకుని మ‌రీ ఈ నాట‌కం కోసం ప‌రుగులు పెట్టేవారు.

ఇలా.. ఈ నాట‌కం ఉమ్మ‌డి ఏపీలో దాదాపు కోటి సార్ల‌కు పైగా ప్ర‌ద‌ర్శించారని రికార్డు ఉంది. అంతేకాదు.. ఇప్ప‌టికీ ప‌ల్లెటూళ్ల‌లో ద‌స‌రా స‌హా.. ఇత‌ర ఉత్స‌వాలు జ‌రిగిన‌ప్పుడు.. చింతామ‌ణికి మంచి డిమాండ్ ఉంది. దీనికి ఇంత డిమాండ్ రావ‌డానికి డ‌బుల్ మీనింగ్ డైలాగులే కార‌ణం. ముఖ్యంగా సుబ్బిశెట్టిని కించ‌ప‌రుస్తూ.. వేశ్య‌లు మాట్లాడే మాట‌లు హాస్య పుట్టిస్తాయి. ఇవ‌న్నీ డ‌బుల్ మీనింగ్‌లో ఉంటాయి. అయితే.. సుబ్బిశెట్టి వైశ్య సామాజిక వ‌ర్గం కావ‌డంతో.. ఈ నాటంలో ఆయ‌న‌ను ఆట‌ప‌ట్టిస్తూ .. వేశ్య‌లు చేసే వ్యాఖ్య‌లు త‌మ‌కు ఇబ్బందిని క‌లిగిస్తున్నాయ‌ని.. కొన్నాళ్లుగా వైశ్య సామాజిక వ‌ర్గం అంటోంది. అంతేకాదు.. కొన్ని చోట్ల నాట‌కం ప్ర‌ద‌ర్శిస్తున్న ప్రాంతాల‌కు వెళ్లి ఆందోళ‌న‌లు కూడా చేప‌ట్టిన సంద‌ర్భాలు ఉన్నాయి.

 ఇక‌, ఇటీవ‌ల వైశ్య సామాజిక వ‌ర్గానికే చెందిన దేవ‌దాయ శాఖ‌ మంత్రి వెలంప‌ల్లి శ్రీనివాస్‌కు త‌న సొంత‌ సామాజిక వ‌ర్గం నుంచి పెద్ద సెగ త‌గిలింది. మ‌న సామాజిక వ‌ర్గాన్ని కించ ప‌రుస్తుంటే.. మీరు చూస్తూ ఎలా ఊరుకున్నార‌నే ప్ర‌శ్న‌లు వ‌చ్చాయి. దీంతో ఆయ‌న సీఎం జ‌గ‌న్‌ను నెల రోజుల కింద‌టే రిక్వ‌స్ట్ చేశారు. ఈ నేప‌థ్యంలోనే అనూహ్యంగా చింతామ‌ణిపై బ్యాన్ విధిస్తూ.. ప్ర‌భుత్వం  ఉత్త‌ర్వులు ఇవ్వ‌డం గ‌మ‌నార్హం. అయితే.. క‌ళాప్రియులు, నాట‌క ప్రియులు మాత్రం.. `క‌ళ‌ను క‌ళ‌గా భావించాలే కానీ.. ఇలా ప్ర‌తి దానినీ కులాల‌కు ముడిపెట్ట‌డం సరైంది కాదు!“ అని వ్యాఖ్యానిస్తుండ‌డం గ‌మ‌నార్హం.