రాజస్థాన్ స్థానిక ఎన్నికల్లో అధికార బీజేపీతో ప్రతిపక్ష కాంగ్రెస్ ఢీ అంటే ఢీ అంటూ పోటీ పడింది. బీజేపీ కంచుకోటల్లో సైతం సత్తా చాటింది. అనూహ్యంగా స్వతంత్ర అభ్యర్థులు సైతం అత్యధిక స్థానాల్లో గెలుపు సాధించడం విశేషం. సాక్షాత్తు ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థులు జెండా ఎగరేయడం సంచలనం సృష్టిస్తోంది. మాజీ ముఖ్యమంత్రి నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలవడం చర్చగా మారింది.
రాజస్థాన్ లోని 309 మున్సిపాలిటీలో గల 10, 245 వార్డులకు ఈనెల 9.11 తేదీల్లో రెండు విడతలుగా ఎన్నికలు నిర్వహించారు. 14 వ తేదీన ఎన్నికల ఫలితాలు విడుదల చేశారు. ఇందులో కార్పొరేషన్లు, మున్సిపల్ కౌన్సిల్లు కూడా వున్నాయి. ఈ ఎన్నికల్లో అధికార బీజేపీ , ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య హోరా హోరీగా జరిగాయి. పలు స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు ప్రధాన పార్టీలకు ముచ్చెమటలు పట్టించారు. ప్రలోభాలకు లొంగకుండా, తీవ్రమైన ఒత్తిళ్లకు తలోగ్గకుండా మూడో స్థానంలో నిలవడం ఇప్పుడా రాష్ట్రంలో పెద్ద చర్చకు దారి తీసింది.
అధికార బీజేపీ 4179 వార్డుల్లో విజయం సాధించింది. దానికి ఏమాత్రం తగ్గకుండా ప్రతిపక్ష కాంగ్రెస్ 3,613 వార్డుల్లో జయకేతనం ఎగరేసింది. స్వతంత్ర అభ్యర్థులు 2,273 వార్డులను కైవసం చేసుకున్నారు. బికనీర్ జిల్లా నోఖా మున్సిపాలిటీలో సిపిఎం విజయం సాధించి విస్మయ పరిచింది. ఇక్కడ 45 వార్డులు వుండగా సిపిఎం 39 వార్డులను గెలిచి మున్సిపాలిటీని కైవసం చేసుకుంది.
మొత్తం 10 మున్సిపల్ కార్పొరేషన్లలో అధికార బీజేపీ కేవలం నాలుగు కార్పొరేషన్లలో మాత్రమే విజయం సాధించింది. ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ సొంత ఊరైన భరత్ పూర్ మున్సిపల్ కార్పొరేషన్లో స్వతంత్ర అభ్యర్థులు ఏకంగా 36 వార్డులను గెలుచుకొని కార్పొరేషన్లో జెండా పాగా వేశారు. కాంగ్రెస్ పార్టీ బికనీర్ తో పాటు మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే నియోజకవర్గం పరిధిలోని ఝలావర్ మున్సిపాలిటీల్లో గెలిచింది.
బీజేపీ కంచుకోటలుగా పేరున్న పలు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ గెలవడం మారుతున్న రాజకీయ పరిణామాలకు అద్దం పడుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates