ఇండోనేషియాలో నౌక గల్లంతు

ఇండోనేషియా లోని జావా సముద్రంలో జరిగిన నౌక ప్రమాదంతో ఈ ఆదివారం తెలవారింది. సముద్రం మధ్యలో నౌక మునిగిపోవడంతో 140 మంది గల్లంతయ్యారు. దీంతో యావత్ ప్రపంచం ఉలిక్కి పడింది. నిముషాల్లోనే ఈ వార్త సోషల్ మీడియా ద్వారా ప్రపంచం మొత్తం తెలిసిపోయింది.

శనివారం ఉదయం తూర్పు జావాలోని సుబరయ నగరం నుంచి వర్గో ట్రాన్స్పోర్ట్ 8 అనే ప్యాసింజర్ నౌక బయలుదేరింది. దక్షిణ కాళిమంతాన్ లోని బంజర్ మాసిన్ నగరానికి చేరుకోవాల్సి వుంది. ఈ నౌకలో 243 మంది ప్రయాణికులతో బయలుదేరిన ఈ నౌక ఆదివారం తెలవారుజామున 2 గంటల ప్రాంతంలో రాడార్ సంబంధాలు తెగిపోయాయి. సముద్రంలో ఏర్పడిన ప్రతీకూల వాతావరణం కారణంగా నౌక మునిగిపోయినట్లు వార్తలు వస్తున్నాయి.

సమాచారం తెలిసిన వెంటనే ఇండోనేషియా సెర్చ్ అండ్ రెస్క్యూ ఏజన్సీ బసర్నాస్ రంగంలోకి దిగింది. హెలికాప్టర్లు, ప్రత్యేక యుద్ధ నౌకలు, రెస్క్యూ టీంలతో గాలింపు చర్యలు చేపట్టింది. ఇప్పటివరకు 103 మందిని రక్షించగా, వారిలో ఒకరు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. మరో 140 మంది ఆచూకీ ఇంకా తెలియకపోవడంతో వారి కోసం సముద్రంలో ముమ్మరంగా గాలింపు కొనసాగుతోంది. సముద్రంలో ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉండటంతో గాలింపు చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతుందని, ఇది రెస్క్యూ టీంకు సవాలుగా మారుతుందని అధికారులు చెబుతున్నట్లు సమాచారం .

ప్రమాద సమయంలో సముద్రంలో వాతావరణ పరిస్థితులు తీవ్రంగా ఉన్నట్లు సమాచారం. భారీ అలలు ఎగిసి పడుతుండటంతో నౌక ఒకవైపుకు ఒరిగిపోయిందని, అనంతరం అదుపు తప్పి మునిగిపోయినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. కొన్ని నివేదికల ప్రకారం సముద్రంలో అలలు సుమారు 3 మీటర్ల వరకు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదానికి ముందు నౌక ఒరిగిపోతున్నట్లు కెప్టెన్ సమాచారం అందించినట్లు తెలుస్తుంది. బంజర్మసిన్‌కు సుమారు 148 కిలోమీటర్ల దూరంలోని జావా సముద్ర ప్రాంతంలో నౌక చివరిసారిగా గుర్తించబడినట్లు సమాచారం.

నౌక ప్రమాదానికి అసలు కారణం ఏమిటన్నది అధికారిక దర్యాప్తు పూర్తయ్యే వరకు స్పష్టంగా చెప్పలేమని అధికారులు చెబుతున్నారు . ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు, నౌక ప్రస్తుత పరిస్థితి, గల్లంతైన వారి వివరాలు, ఆచూకీ లభించిన వారి సమాచారం వెలువడాల్సి ఉంది. అయితే నౌకలో ప్రయాణించిన వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఏ క్షణాన ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనని టెన్షన్ పడుతున్నారు. ఎవరు గల్లంతయ్యారు, ఎవరు ప్రాణాలతో బయట పడ్డారో తెలియక సుబరాయ, బంజర్ మాసిన్ నగరాల్లో విషాదం నెలకొంది.