అల్లు అర్జున్ మామపై కేసు

టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డిపై కేసు నమోదైన వైనం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. హైదరాబాద్ లోని నానక్‌రామ్‌గూడలో ‘మంత్రి కాస్మోస్’ ప్రాంగణలో ఒక భూవివాదానికి సంబంధించి చంద్ర శేఖర్ రెడ్డిపై పోలీసులకు క్రిమినల్ ఫిర్యాదు అందింది. ‘మంత్రి కాస్మోస్’ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధుల ఫిర్యాదుతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. తమ భవన ప్రాంగణంలోకి చంద్ర శేఖర్ రెడ్డి, మురళీ ధర్ రెడ్డి, గడ్డం రవి అక్రమంగా ప్రవేశించి గేట్ల తాళాలు పగలగొట్టారని ఫిర్యాదు చేశారు.

అంతేకాదు, వారిని అడ్డుకోబోయిన సెక్యూరిటీ సిబ్బందిపై దాడి చేసి బెదిరించారని ఆరోపించారు. అంతేకాదు, తమ ప్రాంగణంలో నిర్మాణాలు ధ్వంసం చేశారని, ఆ స్థలం తమదేనంటూ టిన్ షీట్లు ఏర్పాటు చేశారని ఆరోపించారు. వారిని అడ్డుకోబోయిన సెక్యూరిటీ సిబ్బంది, కొందరు స్థానికులపై చంద్రశేఖర్ రెడ్డి తదితరులు వారిపై దాడికి యత్నించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. స్థానికులతోపాటు సెక్యూరిటీ గార్డులను చేతులతో పక్కకు తోసేస్తూ దౌర్జన్యానికి పాల్పడ్డారని ఆరోపించారు. తమ వ్యవహారంలో ఎవరైనా తలదూర్చితే తీవ్ర పరిణామాలు ఉంటాయని, ప్రాణాలతో వదిలిపెట్టబోమంటూ వార్నింగ్ ఇచ్చారని పోలీస్ కంప్లయింట్ ఇచ్చారు.

ఆ దాడికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్, ఫొటోలను కూడా పోలీసులకు ఫిర్యాదుదారులు అందించారు. అంతేకాదు, తెలంగాణ డీజీపీ, సైబరాబాద్ పోలీస్ కమిషనర్, మాదాపూర్ డీసీపీ, మరియు గచ్చిబౌలి ఏసీపీలకు కూడా అసోసియేషన్ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. చంద్ర శేఖర్, తదితరులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తున్నారు. చంద్ర శేఖర్ రెడ్డి తదితరులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.