యుద్ధం.. సామాన్య ప్రజల ప్రాణాల్ని మాత్రమే కాదు దేశ ఆర్థిక పరిస్థితిని సర్వనాశనం చేస్తుంది. శతాబ్దాల ఘన చరిత్రకు సజీవ సాక్ష్యమైన ఇరాన్ ఇప్పుడు తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. అంతూపొంతూ లేనట్లుగా సాగుతున్న యుద్ధం ఒకవైపు.. మరోవైపు పెరుగుతున్న ధరలతో ఆ దేశ ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో నిత్యావరణ వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతు్నాయి.
బియ్యం.. కోడిగుడ్ల ధరలు ఆకాశానికి అంటుతున్న పరిస్థితి. యుద్ధానికి ముందు.. ఆ తర్వాత అన్నది చూస్తే.. ధరల్లో వచ్చిన మార్పు.. ఇరాన్ కరెన్సీ రియాల్ పతనం కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తుంది. ఆహార ద్రవ్యోల్బణం ఏకంగా 112 శాతానికి చేరుకుంది. తాజాగా ఇరాన్ లో కోడిగుడ్డు ధర 2 లక్షల రియాల్స్ కాగా.. ప్లేట్ కబాబ్ 50 నుంచి 60 లక్షల రియాల్స్ గా పలుకుతోంది.
తాజా పరిణామాల నేపథ్యంలో ఒక అమెరికన్ డాలర్ విలువ 16 లక్షల రియాల్స్ కు దగ్గర్లో ఉన్నట్లుగా చెబుతున్నారు. దీంతో ఇరాన్ ప్రజల పొదుపు మొత్తం ఆవిరి అయ్యే దుస్థితి. యుద్ధంలో అగ్రరాజ్యాన్ని.. ఇజ్రాయెల్ ను సమర్థంగా అడ్డుకున్నట్లు కనిపిస్తున్నప్పటికి.. ఆర్థికంగా మాత్రం దారుణ పరిస్థితులకు చేరింది. దీంతో.. ఆ దేశ ప్రజలు తీవ్ర ఇక్కట్లను ఎదుర్కొంటుననారు.
ప్రజల వద్ద డబ్బులు లేకపోవటంతో అమ్మకాలు తగ్గాయి. హోటళ్లు.. రెస్టారెంట్లు.. చిన్న వ్యాపారాలు నష్టాల్లో నడుస్తూ మూతపడుతున్న దుస్థితి. యుద్ధ వేళ ప్రభుత్వం పన్నులు తగ్గించటం తర్వాత.. టైంకు కట్టకపోతే ఫైన్లు విధిస్తున్న వైనం ఆ దేశ ప్రజల్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. చెక్కులు పెద్ద ఎత్తున బౌన్స్ కావటంతో.. బ్యాంకులు చాలా ఖాతాల్ని మూసేస్తున్నాయి.
టెహ్రాన్ స్టాక్ ఎక్స్చేంజ్ వరుసగా ఎనిమిది వారాల పాటు మూతబడింది. ఆ దేశ చరిత్రలో ఇలా జరగటం ఇదే తొలిసారి. మార్కెట్ తెరిచినా.. ప్రధాన రంగాలైన పెట్రో కెమికల్స్.. స్టీల్ పరిశ్రమలు దెబ్బతినటంతో స్టాక్ ధరలు భారీగా పతనం కావటం ఖాయమంటున్నారు. ఇరాన్ మార్కెట్ లో వస్తువులు ఉన్నప్పటికి.. వాటిని కొనేందుకు ప్రజల వద్ద డబ్బుల్లేని పరిస్థితి. దీంతో.. సామాన్యుడు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
ఇదే పరిస్థితి కొనసాగితే ఏడాది వ్యవధిలో 80 శాతం నుంచి 500 శాతానికి ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు ఆ దేశంలో ఆహార పదార్థాల ధరలు భారీగా పెరిగాయి. వంట నూనెల ధరలు 200 శాతానికి పైనే పెరిగితే.. చివరకు అంత్యక్రియల ఖర్చులు సైతం 40శాతం పెరిగినట్లు చెబుతున్నారు.
ఇరాన్ రియాల్ విలువ ఎంత దారుణంగా పతనమైందన్న విషయాన్ని మరింత తేలిగ్గా.. మన రూపాయిల్లో చెబితే ఇట్టే అర్థమవుతుంది. ఏడాది క్రితం నుంచి యుద్ధం ప్రారంభం వరకు 2 లక్షల రియాల్స్ రూ.400 – 440 మధ్యలో ఉండేది. యుద్ధం మొదలైన తర్వాత..తాజాగా ఇదే 2 లక్షల రియాల్స్ విలువ మన కరెన్సీలో రూ.14కు పడిపోయిన దుస్థితి. తాజా పరిణామాల నేపథ్యంలో చాలామంది తమ వద్ద ఉన్న రియాల్స్ ను అమ్మేసి డాలర్లుగా.. బంగారంగా మార్చుకుంటున్న పరిస్థితి.
Gulte Telugu Telugu Political and Movie News Updates
