నిజమే… ఈ విషయం విన్నంతనే.. ఈ సోకాల్డ్ ఆదునిక జనం నిత్యం పరితపిస్తున్న పోటీ… ఇద్దరు ముక్కు పచ్చలారని పిల్లల ప్రాణాలను నిలువునా తీసేసింది. అంతేనా.. ఆ పోటీ పిచ్చిలో పడిపోయిన ఆ పిల్లల తండ్రి ప్రాణాన్ని కూడా ఉరికి వేలాడేసింది. ఇదెక్కడో.. ఊహాలోకంలో తేలియాడుతున్న అమెరికాలోనో, ఆస్ట్రేలియాలోనో జరగలేదు. మన తెలుగు నేలలో.. పచ్చటి పొలాలు, నిండా సెలయేరులు, మరోవైపు సుందరమైన సముద్ర తీరంతో కళకళలాడుతున్న కాకినాడ తీరంలో చోటుచేసుకుంది. యావత్తు సమాజాన్ని షాక్ కు గురి చేసిన ఈ ఘటనలో 6, 7 ఏళ్ల వయసున్న తన ఇద్దరు ముక్కుపచ్చలారని చిన్నారులను నీళ్లల్లో ముంచేసి చంపేసిన ఓ తండ్రి… ఆ తర్వాత తాను ఉరేసుకున్నాడు.
ఈ ఘటన వివరాల్లోకి వెళితే… పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడేనికి చెందిన వానపల్లి చంద్రకిశోర్, భార్య తనూజ, ఇద్దరు కుమారుడు జోషిల్ (7), నిఖిల్ (6)తో కలిసి కాకినాడ జిల్లా వాకలపూడిలోని ఓఎన్జీసీ కార్యాలయంలో అసిస్టెంట్ అకౌంటెంట్ గా పనిచేస్తున్నారు. అప్పటికే ఆస్తిపాస్తులు ఉన్న కుటుంబం కావడంతో చంద్రకిశోర్ కు పెద్దగా సమస్యలేమీ లేవు. పండంటి ఇద్దరు కుమారులు, భార్యతో సంతోషంగా జీవితం సాగిస్తున్న ఆయన… ఒకటో తరగతి, యూకేజీ చదవుతున్న తన ఇద్దరు పిల్లలు చదువులో వెనుకబడి ఉన్నారని గత కొంతకాలంగా తీవ్రంగా ఆందోళన చెందుతున్నాడు. ఈ ఆందోళన ఎక్కడిదాకా వెళ్లిందంటే… భవిష్యత్తులో తమ పిల్లలు ఎక్కడ ఈ పోటీ ప్రపంచంతో పరుగెత్తలేక అవస్థలు పడతారోనన్న దాకా వెళ్లిపోయింది.
అంతే… ఓ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. హోలీ పండుగ వేళ పెళ్లాంపిల్లలను తీసుకుని ఆఫీస్ కు వెళ్లిన చంద్రకిశోర్.. భార్యను అక్కడే ఉండమని చెప్పి… పిల్లలిద్దరికీ టైలర్ వద్ద కొలతలు ఇప్పించి తీసుకువస్తానని నమ్మించాడు. పిల్లలిద్దరితో కలిసి నేరుగా ఇంటికి వెళ్లిపోయిన చంద్రకిశోర్… ఇక ఎంతమాత్రం ఆలోచించలేదు. ముందే అనుకున్నట్లుగా పిల్లలిద్దరి కాళ్లు, చేతులు తాళ్లతో కట్టేశాడు. వారిద్దరినీ నిండా నీళ్లు ఉన్న బకెట్ లో తలలు ముంచేసి వారి ఊపిరి ఆగిపోయేలా చేశాడు. ఆ తర్వాత తానూ ఇంటిలోనే ఉరేసుకున్నాడు. అంతే.. చంద్రకిశోర్ లోని ఆందోళన ఇద్దరు పిల్లల ప్రాణాలతో పాటు అతడి ప్రాణాలను కూడా బలి తీసుకుంది. తమ మరణాలకు దారి తీసిన కారణాలను అతడు సూసైడ్ నోట్ రాసి మరి చనిపోయాడు.
10 నిమిషాల్లో వస్తానని చెప్పిన భర్త… ఎంతకీ రాకపోయేసరికి తనూజ భర్తకు ఫోన్ చేసింది. ఫోన్ ఎత్తకపోవడంతో ఆమె ఆందోళనకు గురైంది. ఆఫీసులోని చంద్రకిశోర్ సహోద్యోగులను వెంటబెట్టుకుని ఆమె పరుగు పరుగున ఇంటికి చేరుకుంది. ఇంకేముంది… నిండా నీళ్లు బకెట్ లో కాళ్లు చేతులు కట్టబడి విగత జీవులుగా పడి ఉన్న తన ఇద్దరు బిడ్డలు, ఆ పక్కనే ఉరికి వేలాడుతున్న భర్త శవాన్ని చూసి ఆమె బోరుమంది. ఎలాంటి సమస్యలు లేవు… మంచి ఉద్యోగం ఉంది.. ఆర్థిక ఇబ్బందులన్న మాటే లేదు.. అయినా భర్త ఇంతటి దారుణానికి ఎందుకు ఒడిగట్టాడని ఆమె వాపోయింది. అయితే ఈ మరణాలపై తమకు అనుమానం ఉందంటూ చంద్రకిశోర్ సోదరుడు ఆరోపించారు.