రాజ‌ధాని ఎఫెక్ట్ పెరుగుతోంది… వైసీపీలో టెన్ష‌న్ మొద‌లైంది…!

ఇప్ప‌టి వ‌ర‌కు రాజ‌ధాని అమ‌రావ‌తి విష‌యంలో వైసీపీ నేత‌ల‌దే పైచేయిగా ఉంది. ఎట్టి ప‌రిస్థిలోనూ మూడు రాజ‌ధానుల‌కే క‌ట్టుబ‌డ‌తామ‌ని.. నాయ‌కులు స్ప‌ష్టం చేస్తున్నారు. ఇటీవల వైసీపీ నాయ‌కుడు, మంత్రి క‌న్న‌బాబుకూడా ఇదే వ్యాఖ్య‌లు చేశారు. అదేస‌మ‌యంలో పాద‌యాత్ర‌లోనూ పెయిడ్ ఆర్టిస్టులే ఉన్నార‌ని బొత్స స‌త్య‌నారాయ‌ణ కూడా వ్యాఖ్యానించారు. పాద‌యాత్ర‌ను త‌క్కువ చేసి చూపించే ప్ర‌య‌త్నం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నిక‌లు, స్థానిక స‌మ‌రాన్ని చూపించి.. పాద‌యాత్ర‌ను ప్ర‌కాశం జిల్లాలో అడ్డుకునే ప్ర‌య‌త్నం చేశారు. అయితే.. ఇది నిన్న‌టి మాట‌. ఇప్పుడు ప‌రిస్థితి యూట‌ర్న్ తీసుకుంది.

ఎందుకంటే.. నిన్న‌టి వ‌ర‌కు రైతుల ఉద్య‌మానికి.. అమ‌రావ‌తి ఆందోళ‌న‌ల‌కు కేవ‌లం టీడీపీ నేత‌లు మాత్ర‌మే మ‌ద్ద‌తు తెలుపుతున్నార‌ని.. వారికి ఇక్క‌డ భూములు ఉన్నాయ‌ని.. అందుకే వారు రాజ‌ధానిని కోరుకుంటున్నార‌ని.. వైసీపీ నేత‌లు చెప్పుకొచ్చారు. కానీ, ఇప్పుడు అనూహ్యంగా నిన్న‌మొన్న‌టి వ‌ర‌కు అమ‌రావ‌తికి దూరంగా ఉన్న బీజేపీ నేత‌లు.. మ‌ద్ద‌తు తెలిపారు. అది కూడా కేంద్రంలోని పెద్ద‌ల క‌నుస‌న్న‌ల్లోనే వారు ఇక్క‌డకు రావ‌డం.. రైతుల‌కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించ‌డం.. పాద‌యాత్ర‌లో ఆసాంతం పాల్గొంటాని ప్ర‌తిజ్ఞ‌లు చేయ‌డం.. వంటివి సంచ‌ల‌న సృష్టిస్తున్నాయి.

ఇదే విష‌యంపై ఇప్పుడు వైసీపీ నేత‌లు అంత‌ర్మ‌థ‌నంలో ప‌డ్డారు. “నిన్న‌టి వ‌ర‌కు ఒక్క‌పార్టీనే అనుకున్నాం.. ఇప్పుడు బీజేపీ కూడా జ‌త‌క‌ట్టింది. ఇప్పుడు ఏం చేద్దాం” అని కొంద‌రు నేత‌లు గుస‌గుస‌లాడుతున్నారు. టీడీపీని అన్న‌ట్టుగా.. బీజేపీని విమ‌ర్శించే ప‌రిస్థితి లేదు. పైగా.. కొంద‌రికి రాజ‌ధానితోనూ అవినాభావ సంబందం (అంటే.. భూములుకొన‌డం.. ఇక్క‌డ‌పాగా వేయ‌డం వంటివి) లేదు. ఈ నేప‌థ్యంలో వారిని విమ‌ర్శించే అవ‌కాశం లేదు. పైగా కేంద్రంలో ఎవ‌రి అండ త‌మ‌కు ఉంద‌ని ఇప్ప‌టి వ‌ర‌కు వైసీపీ నాయ‌కులు భ‌రోసాతో ఉన్నారో.. వారే ఇప్పుడు అమ‌రావ‌తికి జై కొట్ట‌మంటూ.. తెర‌వెనుక చ‌క్రం తిప్పుతున్నారు.

ఈ నేప‌థ్యంలో ఎలా ముందుకు వెళ్లాలి. కేంద్రంలోని న‌రేంద్ర మోడీ, అమిత్ షా వంటివారే అమ‌రావ‌తికి మ‌ద్ద‌తు ప్ర‌క‌టిస్తున్న‌ట్టు స‌మాచారం ఉన్న నేప‌థ్యంలో ఏం చేద్దాం..? దీనిని ఎలా ప్ర‌తిఘ‌టించాలి? అనే చ‌ర్చ జోరుగా చేస్తున్నారు. అందుకే ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను నిశితంగా గ‌మ‌నిస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు అమ‌రావ‌తికి బీజేపీ మ‌ద్ద‌తుపై నాయ‌కులు ఎవ‌రూ.. కూడా పెద‌వి విప్ప‌లేదు. మ‌రికొద్ది రోజులు ఆగి.. బీజేపీ వ్యూహాన్ని ప‌సిగ‌ట్టి.. అప్పుడు స్పందించాలనే ప్ర‌య‌త్నంలో ఉన్న‌ట్టు తాడేప‌ల్లి వ‌ర్గాల నుంచి వినిపిస్తున్న వ్యాఖ్య‌లు.