బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే అతిపెద్ద వ్యూహాత్మక సవాలు అని శశి థరూర్ నేతృత్వంలోని పార్లమెంటరీ కమిటీ కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో హెచ్చరించింది. మనం ఇప్పుడు జాగ్రత్త పడకపోతే, యుద్ధం జరగకపోయినా సరే, అక్కడ మన ప్రాముఖ్యతను పూర్తిగా కోల్పోయే ప్రమాదం ఉందని కుండబద్దలు కొట్టింది.
అప్పట్లో సమస్య ఒక కొత్త దేశం పుట్టుకకు సంబంధించింది అయితే, ఇప్పుడు జరుగుతున్నది రాజకీయ మార్పు అని కమిటీ పేర్కొంది. షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోవడం, ఇస్లామిక్ తీవ్రవాదుల ప్రభావం పెరగడం వల్ల అక్కడ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. దీనికి తోడు పాకిస్తాన్, చైనాలు అక్కడ తమ పట్టు పెంచుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.
ముఖ్యంగా చైనా తీరు ఆందోళన కలిగిస్తోంది. అక్కడ మౌలిక సదుపాయాలు, పోర్టుల పేరుతో భారీగా పెట్టుబడులు పెడుతోంది. బంగ్లాదేశ్ దగ్గర కేవలం రెండు సబ్ మెరైన్లు ఉంటే, చైనా ఏకంగా ఎనిమిది సబ్ మెరైన్లు పట్టేంత పెద్ద బేస్ను అక్కడ నిర్మిస్తోంది. దీన్ని బట్టే వారి ప్లాన్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. జమాత్-ఇ-ఇస్లామీ లాంటి సంస్థలతో కూడా చైనా సన్నిహితంగా ఉంటోంది.
ప్రస్తుతం అక్కడ షేక్ హసీనా పార్టీ అయిన అవామీ లీగ్పై నిషేధం విధించి, గతంలో బ్యాన్ అయిన జమాత్ ఇ ఇస్లామీకి ఎన్నికల్లో పోటీ చేసే ఛాన్స్ ఇచ్చారు. ఈ మధ్య అక్కడ భారత్ వ్యతిరేకత బాగా పెరిగింది. మన ఈశాన్య రాష్ట్రాలను భారత్ నుంచి విడదీస్తామంటూ అక్కడ కొంతమంది నాయకులు బాహాటంగానే బెదిరింపులకు దిగుతున్నారు.
వేరే దేశాల సైన్యం అక్కడ తిష్ట వేయకుండా భారత్ గట్టి నిఘా పెట్టాలని కమిటీ సూచించింది. కేవలం యుద్ధం వల్ల కాదు, మన నిర్లక్ష్యం వల్ల బంగ్లాదేశ్ మనకు దూరం అయ్యే ఛాన్స్ ఉంది. అందుకే అభివృద్ధి, పోర్టుల విషయంలో వారికి మంచి ఆఫర్లు ఇచ్చి మన సంబంధాలను కాపాడుకోవాలని నివేదికలో స్పష్టం చేశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates