బోయపాటి సిలబస్ మారే టైమొచ్చింది

ఎవరు ఔనన్నా కాదన్నా అఖండ తాండవం 2 బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న వైనం స్పష్టం. కొన్ని ఏరియాల్లో డీసెంట్ గా ఉన్నప్పటికీ మిగిలిన చోట్ల స్ట్రగుల్ అవుతుండటం కలెక్షన్ల సాక్షిగా కనిపిస్తోంది. బ్రేక్ ఈవెన్ కావడం గురించి ట్రేడ్ లో అనుమానాలు మరింత బలపడుతున్నాయి. దర్శకుడు బోయపాటి శీను తన వంతుగా ఇంటర్వ్యూలు, స్పెషల్ షోలు లాంటివి నిత్యం చేస్తున్నారు కానీ వీటి వల్ల ఏదో అద్భుతం జరిగిపోతుందని అనుకోలేం. సరే ఫైనల్ స్టేటస్ తేలడానికి ఇంకో వారం పడుతుందని అనుకున్నా ఇప్పుడు మూవీ లవర్స్, బాలయ్య అభిమానుల మధ్య జరుగుతున్న చర్చ ఒకటుంది. అదే బోయపాటి సిలబస్.

కెరీర్ ప్రారంభం నుంచి బోయపాటి శీను మాస్ కథలే రాసుకుంటున్న మాట వాస్తవం. వెంకటేష్ లాంటి ఫ్యామిలీ హీరోని ఊర మాస్ ఫ్యాక్షనిస్ట్ గా తులసిలో చూపించడం ఆయనకే చెల్లింది. డెబ్యూ మూవీ భద్రలోనే తన మార్క్ ఏంటో బయట పడింది. అయితే సింహ, లెజెండ్ ఇచ్చిన కాన్ఫిడెన్స్ బోయపాటి శీనుని మరీ అతిశయోక్తిగా మార్చేశాయి. వినయ విధేయ రామాలో ఇది పీక్స్ కు వెళ్తే, దాన్ని డిజాస్టర్ చేసి ప్రేక్షకులు ఒక హెచ్చరిక చేశారు. అఖండతో కంబ్యాక్ అయ్యారు కానీ దర్శకత్వ ప్రతిభ కన్నా బాలయ్య విశ్వరూపం, తమన్ సంగీతం ప్రధాన పాత్ర పోషించాయనేది అధిక శాతం వ్యక్తపరిచిన అభిప్రాయం.

రామ్ స్కందలో బోయపాటి మరోసారి దొరికిపోయారు. ఖర్చు భారీగా పెట్టారు కానీ రిజల్ట్ మాత్రం ఫ్లాప్. ఇప్పుడు విపరీతమైన అంచనాలు మోసుకొచ్చిన అఖండ 2 మరోసారి ఆయన స్టయిల్ మార్చాల్సిన అవసరాన్ని గుర్తు చేసింది. కమర్షియల్ మీటర్ పరిమిత మోతాదు కన్నా దాటితే మాస్ ఆడియన్స్ సైతం అంగీకరించరు. బలమైన కథనం లేకుండా కేవలం ఎలివేషన్లతో నెట్టుకురాలేం. ఇక్కడ బాలయ్యకు బోయపాటి మీద ఉన్న నమ్మకమే సబ్జెక్టు గురించి ఆలోచించకుండా ఒప్పుకునేలా చేసింది. ఇప్పుడు బోయపాటి శీను చేతిలో లాకైన సినిమా లేదు. గీతా ఆర్ట్స్ బ్యానర్ కో కమిట్ మెంట్ ఉంది. అది కూడా బాలకృష్ణతోనే అనే ప్రచారం జరుగుతోంది కానీ ప్రస్తుతానికి కన్ఫర్మ్ కాలేదు. చూడాలి ఏం చేస్తారో.