ఖర్చు పెట్టే ప్రతి రూపాయి లెక్క తెలియాలి

ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఖ‌ర్చుచేసేది ప్ర‌జాధ‌న‌మ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. అందుకే ఖ‌ర్చు చేసే ప్ర‌తి రూపాయికీ ఫ‌లితాన్ని ఆశిస్తాన‌ని చెప్పారు. “ఏదో ఇచ్చేశాం.. మీరేదో ఖ‌ర్చు చేసేశాం.. అంటే కుద‌ర‌దు. ప్ర‌తి రూపాయికీ ఫ‌లితం చూపించాలి. అది ఎలా వినియోగం అవుతోంది? ఎవ‌రికి మేలు చేస్తోంది? ల‌క్ష్యం సాధించే దిశ‌గా వేసిన అడుగులు ఎలా ఉన్నాయి.?  ఇత‌రుల‌కు స్ఫూర్తినిస్తున్నాయా?  లేదా? అనే విష‌యాల‌పై అధ్య‌య‌నం చేస్తా. మీరు కూడా అలానే వ్య‌వ‌హ‌రించాలి“ అని సీఎం చంద్ర‌బాబు సూచించారు.

క‌లెక్ట‌ర్ల స‌ద‌స్సులో రెండో రోజు సీఎం చంద్ర‌బాబు కీల‌క అంశాల‌పై దృష్టి పెట్టారు. ముఖ్యంగా విద్యా రంగంలో అమ‌లు చేస్తున్న సంస్క‌ర‌ణ‌లు.. వెచ్చిస్తున్న నిధుల గురించి మాట్లాడారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగాఏపీలో మాత్ర‌మే త‌ల్లికి వంద‌నం కార్య‌క్ర‌మం అమ‌ల‌వుతోంద‌న్నారు. దీనికింద వేల కోట్ల రూపాయ‌ల‌ను త‌ల్లుల ఖాతాల్లో వేసి రికార్డు సృష్టించామ‌ని తెలిపారు. అయితే.. ఆ నిధులు త‌ల్లిదండ్రులు ఎలా ఖ‌ర్చు చేస్తున్నార‌న్న విష‌యంపై క‌లెక్ట‌ర్లు దృష్టి పెట్టాల‌ని సూచించారు.

విద్య‌కు సంబంధించి మాత్ర‌మే వినియోగించేలా తల్లిదండ్రుల‌ను మోటివేట్ చేయాల‌ని సీఎం చంద్ర‌బాబు చెప్పారు. అదేవిధంగా స్కూళ్లు, కాలేజీల‌కు ఇస్తున్న నిధుల‌ను కూడా స‌మ‌గ్రంగా ఖ‌ర్చు చేయ‌డంతో పాటు. వాటి విష‌యంలో క‌లెక్ట‌ర్లు జవాబుదారీగా వ్య‌వ‌హ‌రించాల‌ని సూచించారు. ఖ‌ర్చు త‌క్కువ ఫ‌లితం ఎక్కువ‌గా ఉండే విధానాల‌ను అల‌వ‌రుచుకోవాల‌ని కూడా చంద్ర‌బాబు తెలిపారు. ఉదాహ‌ర‌ణ‌కు పార్వతీపురం మ‌న్యం జిల్లాలో క‌లెక్ట‌ర్ చేసిన ప్ర‌యోగాన్ని ఆయ‌న అభినందించారు.

ఇక్క‌డి పాఠ‌శాల‌ల్లో `ముస్తాబు` కార్య‌క్ర‌మం అమ‌ల‌వుతోంది. ఈ కార్య‌క్ర‌మం కింద‌.. ప్ర‌తి పాఠ‌శాల‌కు.. అద్దాలు, దువ్వెన‌లు ఇచ్చారు. విద్యార్థులు ఇంటి నుంచి స్కూలుకు వ‌చ్చినా.. మ‌ధ్యాహ్న భోజ‌నం త‌ర్వాత‌.. త‌మ జుట్టు దువ్వుకోవ‌డంతోపాటు.. ఆహ్లాదంగా ఉండేలా చూసుకునేందుకు ఈ విధానం ఉప‌యోగ‌ప‌డుతోంది. దీనిని రాష్ట్ర వ్యాప్తంగా అమ‌లు చేయాల‌ని చంద్ర‌బాబు సూచించారు. దీనికి నిధుల‌తో కూడా ప‌నిలేద‌ని.. ఇదేస‌మ‌యంలో విద్యార్థుల్లో ఆత్మ స్థ‌యిర్యం పెరుగుతుంద‌ని ఆయ‌న తెలిపారు.