‘మిరాయ్’తో వచ్చింది… వీటితో పోయింది

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అంటే వేరే వాళ్ల భాగస్వామ్యంలో లో బడ్జెట్ సినిమాలు తీసే నిర్మాణ సంస్థ. కానీ గత కొన్నేళ్లలో ఆ సంస్థ రేంజే మారిపోయింది. టాలీవుడ్లో ఎవ్వరికీ సాధ్యం కాని విధంగా ఒకే సమయంలో పాతిక సినిమాల దాకా లైన్లో పెట్టి అందరికీ పెద్ద షాకే ఇచ్చింది. అందులో చిన్న, మిడ్ రేంజ్ సినిమాలతో పాటు పెద్ద చిత్రాలూ ఉన్నాయి.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో ‘బ్రో’ తీశారు. మాస్ రాజా రవితేజతో ‘ధమాకా’, ‘ఈగల్’ చేశారు. తేజ సజ్జను పెట్టి పెద్ద బడ్జెట్లో ‘మిరాయ్’ తీశారు. రెబల్ స్టార్ ప్రభాస్‌తో ‘రాజా సాబ్’ను లైన్లో పెట్టారు. ఇవి కాకుండా చిన్న, మిడ్ రేంజ్ సినిమాలు చాలానే ఆ సంస్థ నుంచి వచ్చాయి. కాకపోతే కేవలం రాశి ఉంటే సరిపోదు కదా.. వాసి కూడా ఉండాలి. పీపుల్ మీడియా సంస్థ విషయంలో అదే మిస్సవుతోంది. ‘ధమాకా’, ‘మిరాయ్’ మినహాయిస్తే గత కొన్నేళ్లలో పీఎంఎఫ్ నుంచి హిట్ సినిమాలే లేవు.

మొదట్లో వేరే నిర్మాణ సంస్థలతో కలిసి ఆచితూచి సినిమాలు చేస్తున్నపుడు ఓ బేబీ, గూఢచారి, రాజ రాజ చోర, కార్తికేయ-2 లాంటి విజయాలు దక్కాయి. కానీ సొంతంగా ప్రొడక్షన్ చేస్తూ ఎక్కువ సినిమాలు చేస్తున్నపుడు మాత్రం సక్సెస్ రేట్ దారుణంగా ఉంటోంది. బ్రో, ఈగల్, రామబాణం, బబుల్ గమ్, శ్వాగ్, విశ్వం.. ఇలా గత రెండు మూడేళ్లలో పీఎంఎఫ్ నుంచి చాలా ఫ్లాపులు వచ్చాయి. ఐతే ఫ్లాపుల పరంపరకు తెరదించుతూ ఈ ఏడాది ‘మిరాయ్’తో ఘనవిజయాన్నందుకుంది ఆ సంస్థ.

దీంతో పీఎంఎఫ్ గాడిన పడినట్లే అనుకున్నారు. ఆ సంస్థ నుంచి రావాల్సిన సినిమాలు ప్రామిసింగ్‌గా కనిపించాయి. కానీ ఇదే ఏడాది తెలుసు కదా, మోగ్లి చిత్రాలతో పలకరించింది పీపుల్ మీడియా. ఇవి రెండూ ఇంకదాన్ని మించి ఒకటి ఫ్లాపయ్యాయి.

‘మిరాయ్’తో వచ్చింది ఈ రెండు చిత్రాలతో పోయిన పరిస్థితి. ఇప్పుడిక ‘రాజా సాబ్’ మీదే విశ్వప్రసాద్ ఆశలన్నీ నిలిచాయి. తమ సంస్థలో వచ్చిన నష్టాలన్నింటినీ ‘రాజా సాబ్’ భర్తీ చేస్తుందని ఇంతకుముందే విశ్వప్రసాద్ చెప్పారు. సంక్రాంతికి రానున్న ఈ చిత్రం ఆయన మాటను నిలబెడుతుందేమో చూడలి మరి.