దమ్ముంటే నన్ను జైలుకు పంపు: జగన్ కు బీజేపీ మంత్రి సవాల్

మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్ జగన్ వ్యాఖ్యలు ఏపీలో కలకలం రేపుతున్నాయి. మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తున్నారంటూ వైసీపీ కోటి సంతకాలను గవర్నర్ కు సమర్పించారు. దానికి ముందు జగన్ మాట్లాడుతూ మెడికల్ కాలేజీల అంశంలో వారిని రెండు నెలల్లో జైలుకు పంపుతాను అంటూ బెదిరింపు వ్యాఖ్యలు చేశారు. దీనిపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ ఫైర్ అయ్యారు.

దమ్ముంటే ముందు తనను జైలుకు పంపాలని జగన్ కు ఛాలెంజ్ విసిరారు. బెదిరించడం అనేది ఆటవిక మనస్తత్వానికి నిదర్శనం అనే ఆయన అన్నారు. పేద విద్యార్థులకు నాణ్యమైన వైద్యవిద్య, పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో తెచ్చిన పీపీపీ విధానంలో ఆసుపత్రులు, మెడికల్ కళాశాలల నిర్మాణానికి ముందుకు వచ్చిన సంస్థలను, వ్యక్తులను, అధికారంలోకి వచ్చిన తర్వాత జైలుకు పంపుతానని జగన్ బెదిరించడం అత్యంత హేయం. జైలుకు పంపడం కాదు కదా, వారి తలపైన వెంట్రుక కూడా పీకలేరు అని అన్నారు.

అత్యంత అవినీతిపూరిత 30 కేసులు ఉన్న జగన్, ముందు తను జైలుకు పోకుండా చూసుకోవాలని సూచించారు. ఇది కేంద్ర ప్రభుత్వ విధానపర నిర్ణయం. ఎన్డీయే ప్రభుత్వం నీతి అయోగ్ ప్రతిపాదనతో, న్యాయస్థానాలు, పార్లమెంటరీ స్థాయి సంఘం సమర్థించిన విధానం. దాదాపు 20 రాష్ట్రాలు అవలంభిస్తున్న విధానం అని మంత్రి వివరించారు. మీకు ధైర్యం ఉంటే ఈ శాఖను నిర్వహిస్తున్న తనను జైలుకు పంపాలని సవాల్ విసిరారు. ఈ విషయంలో ధైర్యం ఉంటే సీబీఐ విచారణ కోరండని సూచించారు. మీకు ధైర్యం ఉంటే తనను న్యాయస్థానాలు ద్వారా జైలుకు పంపాలని మాజీ సీఎం జగన్‌కు స్పష్టం చేశారు.