తిరుమలలో భక్తులను జగన్ దోచుకున్నారు: రఘురామ

జగన్ హయాంలో హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా అనేక చర్యలు జరుగుతున్నాయని ఆనాడు ఆ పార్టీ రెబల్ ఎంపీగా ఉన్న రఘురామకృష్ణరాజు సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. జగన్ సీఎం అయిన తర్వాత తిరుమల కొండతో పాటు ఏపీలో క్రిస్టియానిటీ పెరిగిందని, ఈ వ్యవహారంపై దృష్టి సారించాలని ఆయన కేంద్రంలోని బీజేపీ పెద్దలకు కూడా పలుమార్లు లేఖ రాశారు. కట్ చేస్తే ఆ రోజు రఘురామ ఆరోపించిన విధంగానే తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు, కల్తీ నెయ్యి వాడిన వైనంపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెను దుమారం రేగింది.

ఈ క్రమంలోనే తాజాగా ఆ వ్యవహారంపై ఉండి టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు స్పందించారు. తిరుమల శ్రీవారి భక్తులు మనోభావాలను జగన్ దెబ్బతీశారని, అందుకే జగన్‌ను ఆ వేంకటేశ్వర స్వామి వారు ఓడించారని రఘురామ అన్నారు. వెంకన్న నుంచి ఆయన భక్తులను ఎలా దూరం చేయాలనే క్రిమినల్ ఆలోచనలతో జగన్ హయాంలో టీటీడీ బోర్డు పని చేసిందని సంచలన ఆరోపణలు చేశారు. నెయ్యి కల్తీ చేసిన వైసీపీకి ప్రజలు గొయ్యి తీశారని సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది.

లడ్డూల తయారీలో జంతువుల కొవ్వు ఉన్నట్లు పరీక్షల్లో తేలిందని, అవి టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు కావని అన్నారు. శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని తెలిసీ సీఎం చంద్రబాబు తప్పనిసరి పరిస్థితుల్లో ఈ విషయం బయట పెట్టాల్సి వచ్చిందని వివరణనిచ్చారు. జగన్ హయాంలో తిరుమలలో లీటర్ వాటర్ బాటిల్ ధర 60 రూపాయలనని గుర్తు చేశారు. భక్తులకు ఉచితంగా మంచినీరు సీసాలు అందించాలని, భక్తులు బస చేసే గదుల ధరలు తగ్గించాలని రఘురామ అభిప్రాయపడ్డారు. తిరుమల కొండపై భక్తుల సౌకర్యాలను మెరుగుపరిచేందుకు ఎన్డీఏ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.

జగన్ హయాంలో భక్తులను దోచుకున్నారని, వాటర్ బాటిల్ ధర 60 రూపాయలు పెట్టారని మండిపడ్డారు. అద్దె గదుల ధరలను అడ్డుగోలుగా పెంచారని, హోటళ్ల లీజును పెంచడంతో యజమానులు ఆ భారాన్ని భక్తులపై మోపారని ఆరోపించారు. స్వామి దర్శనానికి క్యూ లైన్లలో నిలుచున్న భక్తులకు పాలు ఇచ్చే వారని, కానీ, ఆ విధానానికి కూడా జగన్ స్వస్తి పలికారని ఆరోపించారు. జెరూసలేం, మక్కా యాత్రలకు వెళ్లే భక్తులకు రాయితీలు ఇచ్చిన జగన్ తిరుమలకు వచ్చే వారి పై ఆర్థిక భారం మోపారని ఆరోపించారు.