విశాఖ ఉక్కుకు కేంద్రం మ‌రో షాక్‌!

Vizag Steel Plant

ఆంధ్రుల హ‌క్కుగా ఏర్ప‌డిన విశాఖ ఉక్కును ప్రైవేటు ప‌రం కాకుండా నిల‌బెట్టుకునేందుకు కార్మికులు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఈ క్ర‌మంలో ఉద్య‌మాలు, నిర‌స‌న‌లు, నిరాహార దీక్ష‌లు కూడా చేస్తున్నారు. ఇక‌, రాజ‌కీయంగా కూడా ప్లాంటును నిల‌బెట్టుకునేం దుకు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. కానీ, మ‌రోవైపు ప్లాంటు విష‌యంలో కేంద్ర ప్ర‌భుత్వం న‌ర్మ‌గ‌ర్భంగా వ్య‌వ‌హ‌రిస్తోంది దీనిని నిల‌బెడ‌తామ‌ని, ప్రైవేటు ప‌రం చేయ‌బోమ‌ని బీజేపీ నాయ‌కులు చెబుతున్నా.. వాస్త‌వానికి మాత్రం క్షేత్ర‌స్థాయిలో మ‌రో వ్య‌వ‌హారం న‌డుస్తోంది.

తాజాగా విశాఖ ఉక్కు క‌ర్మాగారంలో ప‌నిచేస్తున్న ఎగ్జిక్యూటివ్ అధికారుల‌ను వేరే రాష్ట్రాల‌కు బ‌దిలీ చేస్తూ.. జాతీయ గ‌నుల విభాగం అధికారులు ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఏకంగా 100 మంది ఎగ్జిక్యూటివ్ అధికారుల‌ను ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లోని స్టీల్ ప్లాంటుకు డిప్యుటేష‌న్‌పై బ‌దిలీ చేస్తున్న‌ట్టు ఉత్త‌ర్వుల్లో పేర్కొన్నారు. ఈ ప‌రిణామం.. విశాఖ ఉక్కుకు భారీ షాకిచ్చింది. దీంతో విశాఖ స్టీల్ ప్లాంట్ ను ఖాళీ చేసే దిశగా కేంద్రం  వడివడిగా అడుగులు వేస్తున్నద‌న్న అభిప్రాయం మ‌రింత బ‌ల‌ప‌డుతోంది. ఇప్ప‌టికే అనేక రూపాల్లో విశాఖ ఉక్కును కేంద్రం ప‌క్క‌న పెట్టింది.

స్టీల్ ప్లాంట్ నిర్వహణకు నిధులూ ఇవ్వక, ఉన్న ఉద్యోగులను దేశంలోని వివిధ ప్లాంట్లలో గుట్టుచప్పుడు కాకుండా సర్దేసి… చివరకు ఏం చేద్దామని అంటూ.. కార్మికులు ప్ర‌శ్నిస్తున్నారు. మ‌రోవైపు.. ఉద్యోగుల‌ను కూడా వాలంట‌రీ రిటైర్మెంట్ వైపు బ‌ల‌వంతంగా నెడుతున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. దీంతో అస‌లు విశాఖ ఉక్కు ప‌రిస్థితి తీవ్ర అగ‌మ్య‌గోచ‌రంగా మారిపోయింది. ఇంకోవైపు.. “విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగనీయం… తిరిగి పునర్ ‌వైభవం తీసుకు వస్తాం“ అని చెబుతున్న బీజేపీ నాయ‌కులు(ముఖ్యంగా విశాఖ‌లోని అన‌కాప‌ల్లి ఎంపీ బీజేపీ నాయ‌కుడు) ఇప్పుడు ఏం సమాధానం చెబుతారు?  అనే ప్ర‌శ్న‌లు తెర‌మీదికి వ‌స్తున్నాయి. ఏం జ‌రుగుతుందో చూడాలి.