హామీలేమ‌య్యాయి? :బాబుకు జ‌గ‌న్ ప్ర‌శ్న‌.. టీడీపీ కౌంట‌ర్ ఇదే!

ఏపీ సీఎం చంద్ర‌బాబును ఉద్దేశించి ట్విట్ట‌ర్ వేదిక‌గా మాజీ సీఎం జ‌గ‌న్ ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు. ఎన్నిక‌ల‌కు ముందు ఇచ్చిన హామీల‌ను ఇప్పుడు అమ‌లు చేయ‌డం లేద‌ని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో 14 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల అప్పుల్లో ఉంద‌ని చెబుతున్నార‌ని.. ఇప్పుడు రాష్ట్రం బాధ్య‌త‌ను ప్ర‌జ‌ల‌కే వ‌దిలేస్తున్నాన‌ని చెప్ప‌డం ఎంత వ‌రకు స‌మంజ‌స‌మ‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు.

త‌ల్లికి వంద‌నం, రైతు భ‌రోసా, ఫీజు రీయింబ‌ర్స్‌మెంటు నిధుల ఊసే లేకుండా పోయింద‌ని విమ‌ర్శించారు. ఎన్నిక‌ల‌కు ముందు ఇచ్చిన హామీల‌ను అమ‌లు చేయ‌డం మానేసి.. వాటి నుంచి త‌ప్పించుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని వ్యాఖ్యానించారు.

ఎన్నిక‌ల‌కు ముందు ఈ రాష్ట్రం బాధ్య‌త నాది అని చెప్పిన చంద్ర‌బాబు ఇప్పుడు అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. ఆ బాధ్య‌త‌ను ప్ర‌జ‌ల భుజాల‌పై మోపుతున్నార‌ని జ‌గ‌న్ వ్యాఖ్యానించారు. సంపద సృష్టిస్తానని చెప్పి అధికారంలోకి వ‌చ్చి.. ఎన్నిక‌ల‌కు ముందు ఇచ్చిన హామీల‌ను తుంగ‌లో తొక్కార‌ని విమ‌ర్శించారు. ‘హామీలకు నాదీ గ్యారెంటీ’ అని ఎన్నిక‌ల స‌మ‌యంలో ప‌దే ప‌దే చెప్పార‌ని తెలిపారు. అధికారంలోకి వచ్చాక వాటిని మ‌రిచిపోయార‌ని వ్యాఖ్యానించారు. ఇది ప‌చ్చి మోసం కాదా? అని ప్ర‌శ్నించారు. శ్వేత ప‌త్రాలు విడుద‌ల చేసి.. ఖ‌జానా ఖాళీ అయిపోయింద‌ని చెప్ప‌డం ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెట్ట‌డ‌మేన‌ని వ్యాఖ్యానించారు.

తల్లికి వందనం కింద రూ.15 వేలు, రైతు భరోసా పథకం కింద రూ.20 వేలు, 18 ఏళ్లు నిండిన ప్రతి అక్క చెల్లెమ్మకు నెలకు రూ.1,500 ఇస్తామ‌ని చెప్పి.. ఇప్ప‌టి వ‌ర‌కు వాటి ఊసెత్త‌లేద‌ని అన్నారు. నిరుద్యోగ భృతి రూ.3 వేలు మాటేంట‌ని నిల‌దీశారు. విద్యార్థుల‌కు ఫీజు రీయింబర్స్ మెంట్ బ‌కాయిలు కూడా విడుద‌ల చేయ‌లేద‌న్నారు. వసతి దీవెన, సున్నా వడ్డీ పథకాల‌ను ఎత్తేశార‌ని వ్యాఖ్యానించారు. వ‌లంటీర్లను మోసం చేశార‌ని అన్నారు. మొత్తంగా చంద్ర‌బాబుపై జ‌గ‌న్ ప‌లు విమ‌ర్శ‌లు గుప్పించారు. ప‌థ‌కాలను అమ‌లు చేయ‌క‌పోవ‌డాన్ని ఆయ‌న నిల‌దీశారు.

క‌ట్ చేస్తే..

ఇవ‌న్నీ.. చంద్ర‌బాబుకు తెలియ‌దా? అంటే తెలుసు. కానీ, జ‌గ‌న్‌కు చంద్ర‌బాబుకు తేడా ఇదేనని టీడీపీ నాయ‌కులు అంటున్నారు. రాష్ట్రంలో ఖ‌జానా ఖాళీ అయిన‌ప్పుడు.. అప్పులు చేసి పంచ‌డం కంటే సంప‌ద సృష్టించి.. త‌ర్వాత అమ‌లు చేయడం ద్వారా ప్ర‌జ‌ల‌కు మేలు చేయొచ్చ‌న్న సంక‌ల్పంతో చంద్ర‌బాబు ఉన్నార‌ని వారు చెబుతున్నారు. అయినా.. రెండు మాసాల‌కే ఇంత గ‌గ్గోలు ఎందుక‌ని.. ఆరు మాసాలైనా ఆగిన త‌ర్వాత‌.. చంద్ర‌బాబు పాల‌న‌ను చూడాల‌ని వారు సూచిస్తున్నారు.