చెవిరెడ్డి కుమారుడు అరెస్టు.. బెంగ‌ళూరులో అదుపులోకి!

వైసీపీ ముఖ్య నాయ‌కుడు, చంద్ర‌గిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్క‌ర‌రెడ్డి కుమారుడు, వైసీపీ యువ‌నేత‌, తాజా ఎన్నిక‌ల్లో చంద్ర‌గిరి నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయిన చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అరెస్ట‌య్యారు. తిరుప‌తి పోలీసుల ప్ర‌త్యేక బృందం ఆయ‌న‌ను బెంగ‌ళూరులోని ఓ నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. ఎన్నిక‌ల అనంత‌రం.. తిరుప‌తిలో హింస చెలరేగిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో టీడీపీ నాయ‌కుల‌పై ముఖ్యంగా ఆ పార్టీ ఎమ్మెల్యే పులివ‌ర్తి నానిపై దాడులు జ‌రిగాయి. ఈ క్ర‌మంలో కొన్ని రోజుల పాటు తీవ్ర ఉద్రిక్త‌త కొన‌సాగింది. దీనిని అదుపు చేయ‌లేక‌పోయార‌న్న విమ‌ర్శ‌ల‌తో అప్ప‌టి తిరుప‌తి ఎస్పీని సైతం ఎన్నిక‌ల సంఘం బదిలీ చేసింది.

ఈ క్ర‌మంలోనే పులివ‌ర్తి నాని.. కొన్నాళ్ల కింద‌ట త‌న‌పై హ‌త్యాయ‌త్నం చేశారంటూ.. చెవిరెడ్డి మోహిత్‌రెడ్డిపై ఫిర్యాదు చేశారు. దీంతో తిరుప‌తి పోలీసులు ఆయ‌న‌పై 307 సెక్ష‌న్ కింద హ‌త్యాయ‌త్నం కేసు న‌మోదు చేశారు. ఇదిలావుంటే.. పోలీసులు కేసులు పెడుతున్న స‌మ‌యంలోనే మోహిత్‌రెడ్డి రాష్ట్రం వ‌దిలి వెళ్లిపోయారు. ఇక‌, ఈ కేసుల‌ను ఉప‌సంహ‌రించుకునేలా భాస్క‌ర‌రెడ్డి పులివ‌ర్తి నానినీ.. అనేక రూపాల్లో బ్ర‌తిమాలుకున్నారు. మీడియా ముఖంగా కూడా.. తాము అధికారంలో ఉన్న‌ప్పుడు కక్ష‌గ‌ట్టి ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోలేద‌ని.. అనేక సంద‌ర్భాల్లో నానీకి సాయం చేశాన‌ని కూడా చెప్పుకొచ్చారు.

అయితే.. పోలీసులు మాత్రం మోహిత్ రెడ్డి కోసం.. ప్ర‌త్యేక బృందాల‌ను ఏర్పాటు చేసి రాష్ట్రంలోనూ.. బ‌య‌ట కూడా గాలింపును ముమ్మ‌రం చేశారు. ఈ క్ర‌మంలో మోహిత్ బెంగ‌ళూరులో ఉన్నాడ‌ని స‌మాచారం అందుకున్న పోలీసులు అక్క‌డ‌కు వెళ్లి తాజాగా అదుపులోకి తీసుకుని అరెస్టు చేసిన‌ట్టు తెలిసింది. హ‌త్యాయ‌త్నంతోపాటు.. టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌పై దాడులు.. ఎన్నిక‌ల సంఘం ఇచ్చిన ఫిర్యాదుల మేర‌కు కూడా కొన్ని కేసులు న‌మోదు చేశారు. ముఖ్యంగా చంద్ర‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో ఓట‌ర్ల‌ను బెదిరించడం.. టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌ను నిలువ‌రించ‌డం, ఓ కానిస్టేబుల్పై దాడి వంటివి ఈ ఫిర్యాదుల్లో ఉన్నాయి.