ఒక్కొక్క‌రు కాదు.. ఈ సారి గుంపులే!

jagan

ఇప్ప‌టి వ‌ర‌కు వైసీపీ నుంచి ఒక్కొక్క‌రుగా పార్టీకి రాజీనామాలు చేస్తున్నారు. అయితే.. మున్ముందు ఇలా వెళ్లేవారిని ఆపేందుకు.. వారి స‌మ‌స్య‌లు తెలుసుకునేందుకు.. వారితో రాజీ ప‌డేందుకు కూడా.. వైసీపీ నుంచి ఎలాంటి ప్ర‌య‌త్నాలు జ‌ర‌గ‌డం లేదు. గ‌తంలో ప్ర‌తిప‌క్షంగా ఉన్న స‌మ‌యంలోనూ వైసీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలు స‌హా.. అనేక మంది ఇత‌ర నేత‌లు బ‌య‌ట‌కు వ‌చ్చారు. వారిలో సీనియ‌ర్లు కూడా ఉన్నారు. అయిన‌ప్ప‌టికీ.. జ‌గ‌న్ కానీ.. వైసీపీ నేత‌లు కానీ.. ఎవ‌రినీ బుజ్జ‌గించ‌లేదు.

ఇప్పుడు కూడా వైసీపీ అదే వైఖ‌రి తీసుకున్న‌ట్టు క‌నిపిస్తోంది. గ‌తంలో అంటే.. ఈ ఏడాది ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చిన త‌ర్వాత కూడా జ‌గ‌న్‌.. పోయేవారిని పోనీ.. అంటూ పులివెందుల‌లోనే వ్యాఖ్యానించారు. “ఎంత మందిని ఆపుతాం. వెళ్లేవారు వెళ్ల‌నీయండి అన్నా!” అంటూ పులివెందుల నేత‌ల‌తోనే ఆయ‌న తేల్చి చెప్పారు. త‌నను న‌మ్మి ఉండేవారితోనే తాను రాజకీయాలు చేస్తాన‌ని కూడా చెప్పారు. ఇక‌, ఆ త‌ర్వాత‌.. పెద్ద‌గా రాజీనామాలు చేసేవారు క‌నిపించ‌లేదు.

కానీ, ఇటీవ‌ల రెండు మూడు రోజుల వ్య‌వ‌ధిలోనే.. కిలారు రోశ‌య్య‌, మ‌ద్దాలి గిరి, రావెల కిశోర్ బాబు, డొక్కా మాణిక్య వ‌ర‌ప్ర‌సాద్ వంటివారు.. పార్టీకి దూర‌మ‌య్యారు. దీంతో ఒక్కొక్క‌రుగా పార్టీని వీడుతున్నార‌నే చ‌ర్చ తెర‌మీదికి వ‌చ్చింది. అయినా.. దీనిపైపార్టీ అంత‌ర్మ‌థ‌నం చేసుకోలేదు. అంతేకాదు.. ఎవ‌రినీ పిలిచి మాట్లాడేందుకు కూడా ముందుకు రాలేదు. ఇక‌, ఇప్పుడు అస‌లు వ్య‌వ‌హారం ముదురుతోంది. శ్వేత ప‌త్రాల రూపంలో చంద్ర‌బాబు గ‌త వైసీపీ పాల‌న‌లో జ‌రిగిన ఘోరాల‌ను వెల్ల‌డించారు.

వీటిపై విచార‌ణ చేయిస్తాన‌ని చెప్పారు. ఇసుక‌, మ‌ద్యం.. వ్య‌వ‌హారాల‌పై సీఐడీని, ఈడీని కూడా.. పిలుస్తా మన్నారు. ఇది.. వైసీపీలో క్షేత్ర‌స్థాయి నాయ‌కుల‌కు ప్రాణ‌సంక‌టంగా మారింది. ప్ర‌తి జిల్లాలోనూ కీల‌క నాయ‌కులు ఈ విష‌యాల్లో వేలు పెట్టిన వారే. దీంతో ఇప్పుడు వీరు త‌మ దారి తాము చూసుకునేందుకు సిద్ధ‌ప‌డ‌తార‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. సాధార‌ణంగా ఇలాంటివి వ‌చ్చిన‌ప్పుడు.. పార్టీ మారితే కొంత సెగ త‌గ్గుతుంది. విచార‌ణ కూడా ఉండ‌క‌పోవ‌చ్చు. గ‌తంలో అనేక ప‌రిణామాలు కూడా చూశాం. సో.. రాబోయే రోజుల్లో వైసీపీ నుంచి ఒక్కొక్క‌రుగా కాదు.. గుంపులుగా నాయ‌కులు బ‌య‌ట‌కు వ‌చ్చినా ఆశ్చ‌ర్యం లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.