సీరియస్ ఇష్యూ: తమ్ముళ్లు అక్రోశం వింటున్నారా బాబు?

“చంద్రబాబు మారరు. మా బతుకులు మారవు. మా ఖర్మ. ఏం చేస్తాం? అధికారం ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అధికారంలో లేనప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. విపక్షంలో ఉన్నప్పుడు అధికారపక్షం చేసే దాడుల్ని భరించాలి. కేసు పెడితే సర్దుకుపోవాలి. భయం భయంగా బతకాలి. దెబ్బలు తింటే పరామర్శలు ఉంటాయి. కాస్తంత ఓపిక పట్టు. అధికారంలోకి రాగానే బదులు చెబుదామంటూ బడాయి మాటలు చెబుతారు. తీరా అధికారంలోకి వచ్చాక.. బుద్ధిగా ఉండాలంటారు. చంద్రబాబు మారరు. మా బతుకులు మారవు” నెలన్నర తర్వాత తెలుగుదేశం పార్టీ నేతలు.. ద్వితీయ శ్రేణి నాయకులు.. కార్యకర్తల ఆక్రోశమిది.

తమ రాజకీయ ప్రత్యర్థుల మాదిరి కత్తులు.. కర్రలు తీసుకొని రోడ్ల మీదకు రాకున్నా.. అధికారంలోకి వచ్చిన తర్వాత మార్పు కాస్తంతైనా కనిపించాలి కదా? అదెక్కడ? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లుగా.. ఏపీలో పరిస్థితులు లేవని.. ఏమీ లేని దగ్గరే జగన్ ఇంత హడావుడి చేస్తున్నప్పుడు.. ఇంకా చేతులు ముడుచుకొని కూర్చోవాల్సిందేనా? అన్న నిర్వేదం తెలుగు తమ్ముళ్లను కమ్మేస్తుంది. రాష్ట్రంలో అధికార బదిలీ జరిగిన తర్వాత కిందిస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అధిపత్యాలు ఆటోమేటిక్ గా మారుతుంటాయి. కానీ.. ఏపీలో అలాంటి పిరిస్థితి లేదంటున్నారు.

ఇప్పటికి ఏపీలోని అత్యధిక చోట్ల వైసీపీ వారి మాటే చెల్లుతుందని.. వారి ముందు తగ్గి బతకాల్సి వస్తోందన్న సీరియస్ ఆరోపణ తెలుగుదేశం క్యాడర్ నుంచి వినిపిస్తోంది. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తమ బతుకులు మారతాయని భావించిన వారికి మరోసారి నిరాశే ఎదురవుతుందని చెబుతున్నారు.

పేరుకు అధికార పక్షమే తప్పించి.. విపక్షంలో ఉన్నప్పుడు ఎలాంటి అవమానాలు ఎదురయ్యేవో అలాంటి సీన్లే ఎక్కువగా కనిపిస్తున్నట్లు చెబుతున్నారు. తాము కంప్లైంట్లు ఇచ్చినా పోలీసులు కేసులు కట్టట్లేదన్న వాదనను పలువురు తెలుగు తమ్ముళ్లు వినిపిస్తున్నారు.

ఫలానా విషయంలో వైసీపీ వారు చేస్తున్న అన్యాయం గురించి చెప్పేందుకు స్టేషన్ కు వెళితే.. చట్టప్రకారం చేయాల్సి ఉంటుంది. కంప్లైంట్ ఇచ్చేస్తేనే కేసులు కట్టేయటం కుదరదన్న మాట పోలీసులు చెప్పటంపై విస్మయం వ్యక్తమవుతోంది. మరి.. తూచా తప్పకుండా రూల్ బుక్ ప్రకారం పని చేసే అధికారులు వైసీపీ ప్రభుత్వంలో అందుకు భిన్నంగా ఎలా వ్యవహరించారన్నది ప్రశ్నగా మారింది.

తాము గొంతెమ్మ కోర్కెలు కోరటం లేదని.. తప్పుడు కేసులు పెట్టమని కోరటం లేదని.. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా తమకు ఎదురవుతున్న ఇబ్బందులపై ఫిర్యాదులు ఇచ్చేందుకు వెళితే.. పోలీస్ స్టేషన్లలోనూ తగులుతున్న ఎదురుదెబ్బలపై ఆక్రోశం వ్యక్తమవుతోంది.

అధికారంలోకి వచ్చిన తర్వాత మీ సంగతి చెబుతానంటూ అప్పటి విపక్ష నేత.. ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేశంతో చెప్పిన మాటలు.. చేసిన హెచ్చరికలు ఇప్పుడు ఏమైపోయాయి? అని ప్రశ్నిస్తున్నారు. బుద్దిగా ఉండాలని చెప్పే తమ అధినేతకు బుద్ధి ఏమైందన్న సీరియస్ వ్యాఖ్యలు కొందరు తమ్ముళ్లు చేస్తున్నారు.

తమకు తమ అధినేత మీద అపారమైన ప్రేమాభిమానాలు ఉన్నాయని.. కాకుంటే ఇప్పటికి తల దించుకొని వెళ్లాలంటూ.. అవమానాలు పడాలంటూ చెబుతున్న హితబోధ తెలుగుతమ్ముళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ మొత్తం అంశాల్ని టీడీపీ అధినాయకత్వం సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.