ఏ చిన్న అవ‌కాశాన్నీ వ‌ద‌లొద్దు: ఎంపీల‌కు బాబు నిర్దేశం

సోమవారం నుంచి ప్రారంభం అవుతున్న పార్ల‌మెంటు స‌మావేశాల్లో ఏపీకి సంబంధించి నిధులు తీసుకువ‌చ్చే విష‌యంలో ఏ చిన్న అవ‌కాశాన్నీ వదిలి పెట్ట‌వ‌ద్ద‌ని సీఎం చంద్ర‌బాబు టీడీపీ ఎంపీల‌కు సూచించారు. పార్ల‌మెంటు స‌మావేశాల స‌మ‌యంలో రాష్ట్రానికి చెందిన మంత్రులు కూడా వస్తారని, వారిని ఆయా శాఖ‌ల కేంద్ర మంత్రుల‌కు ప‌రిచ‌యం చేసి.. నిధులు వ‌చ్చేలా ఎంపీలు బాధ్య‌త తీసుకోవాల‌ని ఆదేశించారు. కేంద్రం నుంచి నిధులు ఎంత ఎక్కువ‌గా వ‌స్తే.. అంత‌గా ఏపీకి ప్ర‌యోజ‌నం చేకూరుతుంద‌ని.. ప్ర‌స్తుతం ప్ర‌క‌టించిన ప‌థ‌కాల అమ‌లు విష‌యంపైనా ఎంపీలు అవ‌గాహ‌న పెంచుకోవాల‌ని కోరారు.

రాజ‌ధాని అమరావతి నిర్మాణం చేయాల్సి ఉంద‌ని.. రాజ‌ధాని రైతుల‌కు ప‌రిహారం ఇవ్వాల్సి ఉంద‌ని.. ఈ నేప‌థ్యంలో కేంద్రం నుంచి నిధులు రాబ‌ట్టే బాధ్య‌త ఎంపీల‌దేన‌ని తేల్చి చెప్పారు. ఇక‌, పోలవరం స‌హా ఇత‌ర ప్రాజెక్టుల నిర్మాణంపైనా రాష్ట్ర రైతాంగం ఎంతో ఆశ‌తో ఎదురు చూస్తున్న విష‌యాన్ని ఆయ‌న ప్ర‌స్తావించారు. దీనిపై కూడా కేంద్రాన్ని క‌దిలించే బాద్య‌త‌ను ఎంపీలు తీసుకోవాల‌ని సూచించారు. అలాగ‌ని కేంద్ర మంత్రుల‌తో వాద‌న పెట్టుకోవ‌ద్ద‌ని సూచించారు. కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం కోసం ఒక్కో ఎంపీకి ఇప్పటికే కొన్ని శాఖలు చొప్పున బాధ్యతలు అప్పగించిన విష‌యాన్ని చంద్ర‌బాబు ప్ర‌స్తావించారు.

రాష్ట్రాల‌కు సంబంధించి కేంద్రం అమ‌లు చేస్తున్న ప‌థ‌కాల‌కు ఇచ్చే సొమ్ములో ఎక్కువ మొత్తాన్ని జ‌నాభా ప్రాతిప‌దిక‌న యూపీ, తమిళ‌నాడు త‌ర్వాత‌.. ఏపీకి వ‌చ్చేలా చూడాల‌ని ఎంపీల‌కు చంద్ర‌బాబు చెప్పారు. ఏ చిన్న అవ‌కాశం వ‌చ్చినా.. వ‌దులుకోవ‌ద్దన్నారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్‌లో వివిధ ప్రాజెక్టులకు భూముల కేటాయింపునకు సంబంధించి.. కేంద్రాన్ని ప్ర‌శ్నించాల‌ని ఎంపీల‌కు చంద్ర‌బాబు సూచించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను తిరిగి లైన్‌లో పెట్టేందుకు చ‌ర్య‌లు తీసుకునేలా కేంద్రాన్ని ఒప్పించాల న్నారు. కేంద్రం నుంచి పెట్టుబ‌డుల క‌ల్ప‌నకు కూడా ప్రాధాన్యం క‌ల్పించాల‌ని చంద్ర‌బాబు తెలిపారు. ఎంపీలంతా స‌మ‌న్వ‌యంతో ప‌నిచేయాల‌ని.. ప్ర‌తి ఒక్క‌రూ అందుబాటులో ఉండాల‌ని చెప్పారు. పార్ల‌మెంటు స‌మావేశాల్లో త‌ప్ప‌కుండా హాజ‌రు కావ‌డంతో పాటు రాష్ట్ర ప్ర‌యోజ‌నాల విష‌యంలో ప్ర‌శ్నించాల‌ని సూచించారు.